Lal Salaam Trailer: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్ గా నటించిన ‘జైలర్‘ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘లాల్ సలామ్‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో కాకుండా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘జైలర్‌‘ తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మొయిద్దీన్ భాయ్ గా ఆకట్టుకున్న రజనీకాంత్


‘లాల్ సలామ్‘ మూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కేవలం తమిళంలోనే ఈ ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. మొయిద్దీన్ భాయ్ గా అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో తన మార్కు నటనతో అదుర్స్ అనిపించారు. క్రికెట్ నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమాలో మత ఘర్షణలకు ముడిపెట్టి తెరకెక్కించారు. వీటిని ఆపేందుకు మొయిద్దీన్ భాయ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.



33 ఏండ్ల తర్వాత మళ్లీ తెర మీద కనిపించబోతున్న జీవితా రాజశేఖర్


సుమారు ఏడేళ్ల తర్వాత  ఐశ్వర్య రజనీకాంత్​ ‘లాల్ సలామ్‘ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో  సీనియర్‌ నటి జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ తెర మీద కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనే ఈ మూవీపై ఆసక్తి కలుగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రెహమాన్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల గాత్రాన్ని AI టెక్నాలజీ ద్వారా పునఃసృష్టించారు.  'తిమిరి ఎళుడా..' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అవుతోంది. 


అటు 'జైలర్', 'లాల్ సలాం' తర్వాత రజనీకాంత్ మరో సినిమా చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘వెట్టయాన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో కొద్ది రోజుల పాటు కొనసాగింది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. 


Read Also: అచ్చం ‘బేబీ’లా ‘ట్రూ లవర్’ - లవ్, ఎమోషన్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్