Raghu Thatha Movie: హొంబలే ఫిల్మ్స్ సంస్థ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ విడుదలకు రెడీ అవుతోంది. ప్రశాంత్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి ఈ సినిమా హడావిడి దేశవ్యాప్తంగా మొదలయ్యింది. పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోయినా, ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.


‘రఘు తాత’ రిలీజ్ గురించి కీలక ప్రకటన


హొంబలే ఫిల్మ్స్ సంస్థ ‘సలార్’ క్రేజ్ ను తన బ్యానర్ లో నిర్మిస్తున్న ఇతర సినిమాకు సైతం వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు చేస్తోంది. రీసెంట్ గా ‘భగీర’ టీజర్ ను విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ, తాజాగా మరో మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్న ‘రఘు తాత’కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుందంటూ ప్రకటన చేసింది. ఈ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 90వ దశకంలో మాదిరిగా రిక్షా మీద సినిమా రిలీజ్ అనౌన్స్ చేస్తున్నట్లు గ్లింప్స్ లో చూపించారు.






‘సలార్’ క్రేజ్ ను వాడుకుంటున్న హొంబలే ఫిల్మ్స్


వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ‘రఘు తాత’ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన షూటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎలాంటి విషయాలు వెల్లడించకుండానే సడెన్‌గా ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించింది. రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయాన్ని వెల్లడించకుండా, త్వరలో రిలీజ్ అవుతుందని తెలిపింది. ‘సలార్’ హడావిడిలో ఈ సినిమా ప్రకటన ఎందుకు చేశారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అయితే, ‘సలార్’ మూవీ క్రేజ్‌ను సంస్థ వాడుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.    


తమిళంలోకి అడుగు పెట్టిన హొంబలే ఫిల్మ్స్


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బాగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'కాంతార' చిత్రాలతో జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులలో తమకంటూ గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించడం. ఈ సినిమాతోనే తమిళ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతోంది. నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న తొలి తమిళ సినిమా 'రఘు తాత'. సుమన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహిళల హక్కుల కోసం పోరాడే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ సినిమాలో దేవదర్శిని, MS భాస్కర్, రవీంద్ర విజయ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నారు. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, టిఎస్ సురేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అటు వరుణ్ ధావన్ తో కలిసి ‘VD18’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.


Read Also: ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం, డైరెక్టర్ వెంకటేష్ మహా ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్?