పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈరోజు హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ నెల 21నే ఈవెంట్ జరగాల్సింది కానీ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ మరణించడంతో ఫంక్షన్ ను వాయిదా వేశారు. ఇక ఈరోజు ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కేటీఆర్ రానున్నారు. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ పై 'పుష్ప' సినిమా ఎఫెక్ట్ భారీగా పడింది. 


అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా ఈవెంట్ ను కూడా ఇదే గ్రౌండ్స్ లో నిర్వహించారు. అనుమతికి మించి పాస్ లు జారీ చేయడంతో భారీ క్రౌడ్ వచ్చేసింది. దీంతో తోపులాట జరిగింది. కొంతమంది గాయాలపాలయ్యారు. మరికొందరు గేటు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. అభిమానులను పోలీసులు కంట్రోల్ చేయలేక నానాఇబ్బందులు పడ్డారు. దీంతో 'పుష్ప' ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. 


అయితే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా పోలీసులు ముందే రంగంలోకి దిగారు. పాసులను ప్రింట్ చేసే బాధ్యత కూడా పోలీసులే తీసుకున్నారు. సోమవారం నాటి ఈవెంట్ కి ఇంతకుముందే చిత్రబృందం పాస్ లు డిస్ట్రిబ్యూట్ చేసింది. కానీ ఇప్పుడు ఆ పాస్ లు చెల్లవు. కేవలం పోలీసు వారిచ్చే పాసులు ఉంటే తప్ప.. ఇంకెవరినీ అనుమతించరట. సాధారణంగా అయితే ఐదు వేల కెపాసిటీ ఉంటే.. పదివేల పాసులు ముద్రించి పంపిణీ చేస్తుంటారు ఈవెంట్ నిర్వాహకులు.


కానీ, ఈసారి మాత్రం అలా జరగకుండా జాగ్రత్త పడ్డారు. కరెక్ట్ నెంబర్ ప్రకారం.. 5 వేల పాసులను మాత్రమే ప్రింట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి టీవీ ఛానెల్స్ కి కూడా అనుమతి లేదు. నిర్మాణ సంస్థ హారిక హాసిని యూట్యూబ్ ద్వారా మాత్రమే లైవ్ చూసేలా ఏర్పాటు చేశారు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించారు.