అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప: ది రూల్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో, ఈ చిత్రం కోసం సినీ లవర్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప2’లో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకోవడంతో ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించడం ఖాయం అని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ విడుదల చేశారు.


బన్నీ చిటికెన వేలు వెనుక అంత కథ ఉందా?


‘పుష్ప 2’ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ సినీ అభిమానులలో మరింత ఆసక్తి కలిగిస్తోంది. పుష్ప రాజ్ ఎడమ చేతి మూడు వేళ్లకు బంగారు ఉంగరాలు ఉండటంతో పాటు చిటికెన వేలుకి పింక్ నెయిల్ పాలిష్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించడం ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. ఆయన చిటికెన వేలుకి గోర్ల పెయింట్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది. సాంస్కృతి ప్రాముఖ్యతను కలిగిన పురుషులు తమ చేతి చిటికెన వేలుకి నెయిల్ పాలిష్ చేసుకుంటారట.  అంతేకాదు, పొడవాటి గోరుకు పింక్ పెయింట్ వేసుకోవడం సంపద, ఉన్నత సామాజిక స్థితికి సూచనగా భావిస్తారట. మాన్యువల్ లేబర్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తిగా అతడిని పరిగణిస్తారట. తాజాగా ఈ పోస్టర్ విడుదలైన నేపథ్యంలో, దర్శకుడు సుకుమార్ సునిశితదృష్టిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన 'పుష్ప 2'లో ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ సరికొత్తగా కనిపించారు. గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా ఉంటారో, అలా కనిపించారు. మొత్తంగా పోస్టర్లతోనే సినిమాపై ఓరేంజిలో ఆసక్తి కలిగిస్తున్నారు దర్శకుడు.    


రిలీజ్ డేట్ వెనుక  పక్కా ప్లాన్


'పుష్ప 2' చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించడం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న గురువారం సెలవు రోజు కావడం, శుక్ర, శని, ఆదివారం వీకెండ్ కావడం,  సోమవారం  రాఖీ పౌర్ణమి ఉండటంతో భారీగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.  ‘పుష్ప 2’లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'పుష్ప1'కి ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంతో 'పుష్ప 2'ను భారత్ తో పాటు పలు దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


Read Also: త్వరలో రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి - కన్ఫర్మ్ చేసిన సురేష్ బాబు, అమ్మాయి ఎవరో తెలుసా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial