Pusha 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన ‘పుష్ప’ మూవీ దేశ వ్యాప్తంగా దుమ్మురేపింది. ఈ మూవీ రిలీజ్ అయిన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ను ఊతపదంగా మార్చుకున్నారంటే ఎంతలా ఆకట్టుకుందో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప 2’ వస్తోంది. ఫస్ట్ పార్ట్ ను తలదన్నేలా రెండో భాగం ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప రాజ్, షెకావత్ సార్ మధ్య యాక్షన్ సన్నివేశాలు మెస్మరైజ్ చేయబోతున్నాయట. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలోని ప్రతి సీన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.  


నార్త్ ను టార్గెట్ చేసిన సుకుమార్ టీమ్


‘పుష్ప’ సినిమాకు నార్త్ లో కనీవినీ ఎరుగని రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిపై చిత్రబృందం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించినా, ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాట. స్పెషల్ ప్రీమియర్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ముంబైలో డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు షో వేయబోతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 5న తెల్లవారుజామున 1 గంట నుంచి ప్రీమియర్లను వేయబోతున్నారట. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


‘పుష్ప 2’పై బ్లాక్ బస్టర్ రివ్యూలు


ఇప్పటికే ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటు నిర్మాత ఎస్ కేఎన్ బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్తుండగా తాను రెండు సీన్లు చూశానని చెప్పారు. ఈ సీన్లు చూస్తుంటే సినిమా విడుదలయ్యాక వరుస అవార్డులు దక్కించుకోవడం ఖాయంగా అనిపిస్తుందన్నారు. ‘పుష్ప’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ, ఈ సినిమా విడుదల తర్వాత దేశంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు గెల్చుకునే అవకాశం ఉందన్నారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సైతం ఈ సినిమాపై సూపర్ డూపర్ రివ్యూ ఇచ్చారు. ఫస్టాఫ్ అదిరిపోయిందంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సినీ ప్రముఖుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు బన్నీతో పాటు సుకుమార్ కు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.   


‘పుష్ప 2’ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్,  బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.  దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.   


Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?