Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ ‘బ్రో’. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఈ మూవీను తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ జులై 28 విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విదేశాల్లో కూడా పవన్ అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెరికాలోని పవన్ అభిమానులు టెస్లా కార్లతో ‘బ్రో’ సినిమా పేరును క్రియేట్ చేసి పవన్ క్రేజ్ ను మరోసారి రుజువు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


టెస్లా కార్లతో లైట్ షో..


పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పవన్ కు విదేశాల్లో కూడా అలాంటి క్రేజ్ నే ఉంది. ‘బ్రో’ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు అమెరికాలోని డల్లాస్ లో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అందుకోసం టెస్లా కార్లను వరుసగా ‘బ్రో’ మూవీ టైటిల్ ఆకారంలో పార్క్ చేసి లైట్ షో చేశారు. అదంతా డ్రోన్ ద్వారా రికార్డ్ చేశారు. ఆకాశం నుంచి టెస్లా కార్ల లైటింగ్ ‘బ్రో’ ఆకారంలో చాలా అందంగా కనిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్.. ఆనందానికి అవధుల్లేవు.


జులై 25 న ప్రీ రిలీజ్ ఈవెంట్..


ఇక ‘బ్రో’ మూవీ రిలీజ్ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను  స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఈ నెల 25 న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఈ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా చేయాలని చూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కారనే వార్తలు మొన్నటి వరకూ వచ్చాయి. పొలిటికల్ క్యాంపెయిన్ లో ఉన్న ఆయనకు ఈ ఈవెంట్ లో పాల్గొనడం కుదరదనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల సాయి ధరమ్ తేజ్ ఆన్ లైన్ లో సోషల్ మీడియా మేమర్స్ తో మీట్ అయిన సందర్భంలో ఈ ఈవెంట్ కు పవన్ హాజరవుతారనే హింట్ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ తేజ్ కి చెల్లి పాత్రలో కనిపించబోతుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీను నిర్మిస్తోంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 28 న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేయడంతో టికెట్ రేట్ల విషయంలో మార్పులేమీ ఉండవని నిర్మాత ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.


Also Read: రణ్‌వీర్, ఆలియా మూవీలో మమతా బెనర్జీపై వ్యాఖ్యలు, చెత్త డైలాగ్స్‌పై సెన్సార్ వేటు!