ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ వసూళ్ల పరంగా మాత్రం భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది. 


ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏడు వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.48 కోట్ల షేర్ ను వసూలు చేసిందట. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరగడం కూడా 'రాధేశ్యామ్'కి కలిసొచ్చింది. బాలీవుడ్ లో తొలిరోజున ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిందట. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలతో 904K డాలర్లు వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా తొలిరోజు రూ.79 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. 


నార్త్ అమెరికాలో 'రాధేశ్యామ్' స్క్రీన్ల సంఖ్య పెంచారు. అక్కడ సినిమాకి మంచి టాక్ వస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా కనిపించారు. విధికి, ప్రేమకి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేది సినిమాలో చూపించారు. జస్టిన్ ప్రభాకరన్ సాంగ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి.