Salaar Movie: ‘సలార్’ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా తెలంగాణలో అర్థరాత్రి షోలను ప్రభుత్వం ప్రోత్సహించలేదు. కానీ, పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ మూవీ విషయంలో నిబంధనలను సడలించింది. అర్థరాత్రి షోలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాత్రిపూట థియేటర్ల దగ్గర సందడి నెలకొంది. శుక్రవారం తెల్లవారు జామున 1 గంట నుంచే సింగిల్ స్ర్కీన్ లతో పాటు మల్టీ ఫ్లెక్స్ లలో ‘సలార్’ సినిమాను ప్రదర్శించారు. అయితే, తొలి రోజు తొలి షోను చాలా మంది అభిమానులు ఫ్రీగా చూడటం విశేషం. అదేంటి, ‘సలార్’ సినిమాకు టికెట్లు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటే? ఫ్రీగా ఎలా చూశారు అని ఆశ్చర్యం కలుగుతుందా? కానీ, నిజంగా నిజం. వందలాది మంది అభిమానులు తొలి షోను ప్రీగానే చూశారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


దేశ వ్యాప్తంగా ‘సలార్’ జోష్


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘కేజీఎఫ్’ చిత్రాలతో సంచలన సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, ‘బాహుబలి’ చిత్రాలతో పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ అంచనాలకు అనుగుణంగానే అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు జరిగాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఏకంగా రూ. 50 కోట్ల మేర జరిగింది.


ఫ్రీగా సినిమా చూసిన వందలాది మంది అభిమానులు


ఇక హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకే తొలి షో వేశాయి థియేటర్లు, మల్టీఫ్లెక్సులు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేటర్ లోనూ ఉదయం 1 గంటకే సినిమా ప్రారంభం అయ్యింది. థియేటర్ గేట్లు తెవరగానే వందలాది మంది అభిమానులు లోపలికి దూసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు ఏం చేయలేకపోయారు. ఏకంగా 200 మందికి పైగా ప్రేక్షకులు నిలబడే సినిమా చూశారు. వారిలో చాలా మందికి టికెట్ కూడ లేదు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి చాలా ఇబ్బంది, అసౌకర్యం కలిగినా చేసేదేమీ లేక అలాగే చూశారు.   


అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యాలు


అటు హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని మల్లిఖార్జున థియేటర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సుమారు 100 మందికి పైగా అభిమానులు థియేటర్లోకి దూసుకొచ్చి సినిమా చూశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే, తొలి షో విషయంలో తగు భద్రతా చర్యలు తీసుకోకపోవంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. తొలి షో విషయంలో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పలు చోట్ల పోలీసు భద్రత నడుమ షోలను ప్రదర్శించారు.  


‘సలార్’ మూవీ గురించి..


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.


Read Also: '2018' చిత్రానికి నిరాశ, ఆస్కార్ రేసు నుంచి అవుట్ - షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న మూవీస్ ఇవే