టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఆయన అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. పవనోత్సవం పేరుతో  ఫ్యాన్స్ సెలబ్రేషన్స్  జరుపుతున్నారు.  ఈ సందర్భంగా పవర్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. వీటిని థియేటర్లలో చూస్తూ అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు.


పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా 14 ఏండ్ల కింద వచ్చిన ‘జల్సా’ సినిమాను  థియేటర్లలో 4కే వెర్షన్ లో  రీ రిలీజ్ చేశారు.  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఎమోషనల్ టచ్ తో పాటు కమర్షియల్ గానూ మంచి విజయాన్ని అందుకుంది.  ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపాయి. తాజాగా ఈ సినిమా మళ్లీ విడుదల కావడంతో ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. ఈ మూవీలోని ‘మై హార్ట్ ఈజ్  బీటింగ్..’ అనే పాటకు థియేటర్లలో నిలబడి గొంతుకలిపారు. ఒకే పాటను వందలాది మంది పాడటంతో థియేటర్ అంతా మార్మోగిపోయింది.






అటు ఇదే సినిమాను పవన్ కల్యాణ్ మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులతో కలిసి చూశారు. అందరి మాదిరిగానే ఆయన కూడా ఫుల్ హంగామా చేశారు. పేపర్లు చింపి గాల్లోకి విసిరారు. ఇందుకు ఆయన ఒక బస్తా పేపర్లను తెచ్చుకుని తన కుర్చీ కింద పెట్టుకున్నారు. పవన్ ఫ్యాన్స్ తో కలిసి రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.










పవన్ బర్త్ డే సందర్భంగా మరో బ్లాక్ బస్టర్ సినిమా ‘తమ్ముడు’ను రీరిలీజ్ చేశారు. ఆ తర్వాత రోజు జల్సాను విడుదల చేశారు. దాదాపు 501 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజిల్స్, కేరింతలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా మూవీలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ఆరు పాటలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు.