Pindam OTT Streaming: ఈ ఏడాది పలు హారర్ సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘పిండం’. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ వెన్నులో వణుకు పుట్టించింది. మూవీలోని ట్విస్టులకు ఊపిరి బిగపట్టుకుని చూశారు. ఈ చిత్రంలో హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించారు. సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ‘సలార్’ ఫేమ్ ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కళాహి మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు, యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా వ్యవహరించారు.


థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ‘పిండం’


‘పిండం’ మూవీ డిసెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. సినిమా విడుదలయ్యాక, మిశ్రమ స్పందన లభించినా, ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరించారు. ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసిన మేకర్స్, అంచనాలకు తగినట్లుగానే మూవీని తెరకెక్కించినట్లు ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.   


నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘పిండం’ స్ట్రీమింగ్


థియేటర్లలో ప్రేక్షకులను బాగానే అలరించిన ‘పిండం’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ మూవీని కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, జనవరి ఫస్ట్ వీక్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికీ ‘పిండం’ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రేక్షకులను బాగా అలరించిన ‘పిండం’, వచ్చే ఏడాది ఓటీటీ అభిమానులను భయపెట్టబోతోంది. 


‘పిండం’ కథ ఏంటంటే?


‘పిండం’ మూవీ కథ విషయానికి వస్తే, ఆంథోని(శ్రీరామ్‌) ఓ రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా పని చేస్తాడు. అతడి భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి ఓ ఇంట్లో ఉంటారు. అది ఓ పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి కొనుగోలు చేస్తాడు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు అవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథాశంతో ఈ మూవీ రూపొందింది.


మనిషికి మరణం అనేది అంతమా?


ఇక ‘పిండం’ మూవీలో 2023లో పాటు 1990, 1930 కాలాల్లో జరిగిన కథను ఇందులో చూపించారు. మరణం అనేది నిజంగానే అంతమా? అనే విషయంపైనా ఈ సినిమాలో చర్చించారు. ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా? కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా? ఒకవేళ అలా నిలిచిపోతే, ఆ ఆత్మలు మనకు నిజంగానే హాని చేస్తాయా? అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.


Also Read : ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?