పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ చివరి సినిమా వకీల్ సాబ్ వచ్చి ఏడాది దాటిన నేపథ్యంలో.. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.


‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే విడుదల అయ్యాయి. ఆ తర్వాత పెద్దగా అప్ డేట్స్ ఏమీ లేవు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సినిమా యూనిట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఆయన బర్త్ డే సందర్భంగా దుమ్మురేపే గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఇంతకీ అదేంటో తెలుసా? 


వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వెల్లడించింది. పవన్ పోస్టర్ కలిపి పవర్ గ్లాన్స్ కు టైం ఫిక్స్ చేసినట్లు సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ మరో పోస్టర్ విడుదల చేసింది. ‘‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. యుద్ధ రంగంలో పవన్ కల్యాణ్ పోరాడుతున్నట్లుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. గుర్రం రథంతో ఆయన దూసుకెళ్తున్నారు. పవన్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ పోస్టర్ మీద హ్యాపీ బర్త్ డే అని రాశారు.  


హరిహర వీరమల్లు సినిమా యూనిట్ నుంచి వచ్చిన క్రేజి ప్రకటనతో  పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవర్ గ్లాన్స్ ఎలా ఉండబోతుంది..  ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది? అని చర్చించుకుంటున్నారు. పవర్ గ్లాన్స్ కు టైం దగ్గర పడింది అంటూ నెట్టింట్లో అభిమానులు సందడి చేస్తున్నారు. PowerGlance హ్యాష్ టాగ్ తో చర్చలు నడుపుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద  ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.


‘వకీల్ సాబ్’తో పవన్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన  పింక్ మూవీకి రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. అయితే, పవన్ అభిమానులు మాత్రం ‘వకీల్ సాబ్’ కంటే మించి మాస్‌ను మూవీని కోరుకుంటున్నారు.