పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.


నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఫిబ్రవరిలో సినిమా వస్తుందని అన్నారు. తాజాగా 'భీమ్లానాయక్' చిత్రబృందం రెండు కొత్త రిలీజ్ డేట్లను అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 25 లేదా.. ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పాండమిక్ పరిస్థితులు అనుకూలించేదానిపై రిలీజ్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. 


అయితే అభిమానులు మాత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ చేయమంటూ దర్శకనిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న వస్తుందని ప్రకటించిన వెంటనే ఒక్కో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో 'భీమ్లానాయక్' రెండు డేట్స్ ను లాక్ చేసుకున్నాడు. మరెప్పుడు వస్తాడో చూడాలి.


ఇక సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. సినిమా నుంచి కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. అన్నీ కూడా యూట్యూబ్ లో మిలియన్ల హిట్స్ ను రాబడుతున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనుంది.