కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణవార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పునీత్ మరణంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ వంటి వారి ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్స్ చేయగా.. తాజాగా పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


Also Read: బ్రేకింగ్... గుండెపోటుతో క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్‌ మృతి


''ప్రముఖ కన్నడ కథానాయకుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నమ్మశక్యం కాలేదు. శ్రీ పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రముఖ నటులు, కన్నడ కంఠీరవ దివంగత శ్రీ రాజ్ కుమార్ గారి కుమారుడిగా ఆయన అడుగుజాడల్లో నట ప్రయాణం సాగిస్తున్న శ్రీ పునీత్ గుండెపోటుతో స్వర్గస్తులు కావడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బాల నటుడిగానే కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆ దశలోనే ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కథానాయకుడిగా ఎన్నో విజయాలు దక్కించుకొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీ పునీత్ అనూహ్యంగా మృతి చెందటం సినీ ప్రేక్షలకు బాధాకరం. శ్రీ పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 


పునీత్ ని అందరూ పవర్ స్టార్ ని పిలుచుకుంటారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. 'పవర్ స్టార్' అంటే పవన్ కల్యాణ్ గారు మాత్రమేనని అని, ఇక మీదట తనను పవర్ స్టార్ అని పిలవొద్దంటూ.. పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.