మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంటుందనుకుంటే.. అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 'ఆచార్య' ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. ఇప్పుడు లెజండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. తన యూట్యూబ్ ఛానెల్ లో 'ఆచార్య' సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా పరాజయానికి కారణాలను తనదైన శైలిలో వివరించారు. 

 

అసలు ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ పెట్టడమే కరెక్ట్ కాదని అన్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఒకప్పుడు బాగా ఆడేవని, ఆ తరువాత వాటి క్రేజ్ తగ్గిపోయిందని అన్నారు. ఇలాంటి సమయంలో నక్సలైట్ స్టోరీతో సినిమా తీయాలని, మంచి పాయింట్ ను ఆడియన్స్ కి చెప్పాలని కొరటాల భావించి ఉండొచ్చు కానీ కమ్యూనిజం బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చడం లేదని పరుచూరి అన్నారు. 

 

ఒక సినిమాగా చూస్తే 'ఆచార్య'లో తప్పేమీ లేదని.. కానీ కథలో ముఖ్యమైన సంఘటన ఎందుకు జరిగింది..? ఏం జరిగింది అనే విషయాలను చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసిందని పరుచూరి అన్నారు. సస్పెన్స్, సెంటిమెంట్ ఒకేచోట ఉండలేవని అన్నారు. రామ్ చరణ్ పోషించిన సిద్ధ రోల్ ఫస్ట్ హాఫ్ లోనే రావాల్సిందని, మొత్తంగా కాకపోయినా కొంచెమైనా ఆ పాత్రను చూపించి ఉండాల్సిందని అన్నారు. 

 

అసలు రామ్ చరణ్ తో ఆ పాత్ర చేయించాల్సింది కాదని.. ఒకవేళ తప్పదనుకుంటే ఒక పది శాతం ఆ పాత్ర ఉండి.. తొంబై శాతం చిరు క్యారెక్టర్ ఉండాల్సిందని అన్నారు. ఇక సినిమాలో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న చిరంజీవి ఐటెం సాంగ్ లో డాన్స్ చేయాల్సింది కాదని అన్నారు. ఈ సినిమాకి సంగీతం కూడా సరిగ్గా కుదరలేదని.. ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయని పరుచూరి అన్నారు. 'ఆచార్య' సినిమా చూస్తున్నంతసేపు 'మరో మలుపు' సినిమా గుర్తొచ్చింది అన్నారు.