Nandamuri Kalyan Ram Next Movie With Surya Pratap: నందమూరి కల్యాణ్ గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో 21వ మూవీ చేస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కల్యాణ్ రామ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ చిత్రంలో సీనియర్ నటి విజయ శాంతి కీలక పాత్రలో నటించబోతున్నారు. రీసెంట్ విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో పోలీసు అధికారిగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ‘మెరుపు’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


పల్నాటి సూర్య ప్రతాప్ తో కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీ


ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరితో కలిసి సినిమా చేస్తుండగానే, మరో క్రేజీ ప్రాజెక్టుకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో ‘కుమారి 21F’, ’18 పేజెస్’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్నాటి సూర్య ప్రతాప్.. కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారట. ఇప్పటికే ప్రతాప్ ఓ యూనిక్ స్టోరీని కల్యాణ్ రామ్ కు చెప్పారట. ఆ స్టోరీ తనకు చాలా బాగా నచ్చిందట. సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని దర్శకుడికి కల్యాణ్ రామ్ సూచించినట్లు తెలుస్తోంది.  


ప్రదీప్ చిలుకూరి మూవీ పూర్తయ్యాకే నెక్ట్స్ మూవీ షూటింగ్         


ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరితో కల్యాణ్‌ రామ్‌ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు పూర్తికాగానే, కొత్త సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను  ఎన్టీఆర్ ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించాలని భావిస్తున్నాయట. తన శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించే సినిమాకు.. సుకుమార్ అన్ని విధాలుగా సహాయసాకారాలు అందించనున్నట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.


చివరగా ‘డెవిల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్ రామ్


చివరగా కల్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీలో కనిపించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా ఈ సినిమాను తెరకెక్కించారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.



Read Also: ఎన్టీఆర్‌ది డ్యూయల్ రోలే... అఫీషియల్‌గా కొత్త పోస్టర్‌తో కన్ఫర్మ్ 'దేవర' టీమ్!