యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జంటగా నటించిన చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్ లో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. 


'ఖుషి' సినిమాకు సంబంధించిన అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజులకు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 'అందరికీ ఖుషీ ఇచ్చే శుభవార్త' అంటూ అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ - సమంతల రొమాంటిక్ పోస్టర్ ను షేర్ చేసారు. 






Also Read: రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ - హోస్ట్ అవతారమెత్తిన మంచువారబ్బాయ్!


దేవుడిని విశ్వసించని నాస్తికుల కుటుంబంలో పెరిగిన ఒక యువకుడు విప్లవ్(విజయ్ దేవరకొండ).. పరమ భక్తులైన హిందూ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఆరాధ్య (సమంత)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆ ప్రేమ జంట వైవాహిక జీవితం ఎలా సాగింది? అనేదే 'ఖుషి' స్టోరీ. ఇందులో విజయ్, సామ్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. రిలీజ్ కు ముందే సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో.. ఫస్ట్ వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం మూడు రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టగలిగింది. అయితే ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. లాంగ్ రన్ ముగిసే నాటికి కొన్ని ఏరియాల్లో నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 


'ఖుషి' సినిమా యూఎస్ లో 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి, ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసింది. తమిళనాడులో 7 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. కేరళలోనూ ఓకే అనిపించుకుంది. కానీ సొంత గడ్డపై కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 10 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లుగా ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు. మరి డిజిటల్ రిలీజ్ లో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. 


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ 'ఖుషి' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ - శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. సినిమాలోని అన్ని పాటలకు డైరెక్టర్ శివ నిర్వాణ సాహిత్యం రాయడం విశేషం. జి మురళి సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ మూవీకి ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేసారు.


Also Read: వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial