నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'(Unstoppable with NBK) సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ గెస్టులుగా వచ్చిన సంగతి తెలిసిందే. వారు బాలయ్యకు బంధువులు కూడా కావడం, ఈ ఎపిసోడ్‌కు ముందు వదిలిన ప్రోమో అభిమానుల్లో అంచనాలు పెంచేయడంతో.. ఫస్ట్ ఎపిసోడ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో పది లక్షల మందికి పైగా ఈ ఎపిసోడ్‌ను చూశారు. ఇదివరకు ఎన్నడూ ఆహా షోకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదట.


ఇక రెండో ఎపిసోడ్‌లో హీరోలు విశ్వక్ సేన్(Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)లు అతిథులుగా పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది. అందులో బాలయ్య.. ఈ ఇద్దరు యంగ్ హీరోలతో ఆడేసుకున్నారు. తాజాగా మరో ప్రోమో వదిలారు. ఈ ప్రోమో కాస్త ఎమోషనల్ గా సాగింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డను 'ఇండస్ట్రీలో నువ్ ఎదుర్కొన్న అవమానం ఏంటని..?' ప్రశ్నించారు బాలయ్య. 


దానికి సిద్ధు.. 'నేను హీరోగా చేయాలనుకుంటున్నా అన్నా అని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తే.. ఏంటి మొహానికి ఈ మచ్చలేసుకొని హీరో అయిపోదామనుకుంటున్నావా..?' అని అవమానించారని చెప్పారు. దానికి బాలయ్య 'నాకు వస్తున్నాయ్ కన్నీళ్లు.. నువ్ అక్కడైతే ఆపేసి ఇటు రామ్మా' అని సిద్ధుని పిలిచి గుండెలకు హత్తుకున్నారు బాలయ్య. ఆ తరువాత విశ్వక్ సేన్ ని.. 'ఇండస్ట్రీలో నువ్ ఎదుర్కొన్న బిగ్ ట్రబుల్ ఏంటని..?' అని అడిగారు బాలయ్య. 


దాని విశ్వక్ 'ధమ్కీ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నాను. సినిమా షూటింగ్ సమయంలో ఇండస్ట్రీలో బంద్ అన్నారు. మరోపక్క నా అక్క ఆరోగ్యం చెడింది. రాత్రి రెండింటి వరకు హాస్పిటల్ లో ఉండి.. మళ్లీ ఉదయాన్నే 6 గంటలకు సెట్ కి వెళ్లేవాడిని. షూటింగ్ అయ్యాక మానిటర్ వెనక్కి వెళ్లి ఏడ్చేవాడిని. డబ్బు పోతేపోనీ, సెట్ పోతేపోనీ అని అక్క దగ్గరకు వెళ్లి ఉండలేను. ఏమీ చేయలేని పరిస్థితి' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 21న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. 


Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!



నిర్మాతగా బాలయ్య కూతురు:


బాలయ్య రెండో కూతురు తేజశ్విని 'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా పని చేశారు. అయినప్పటికీ.. ఆమె గురించి బాలకృష్ణ కూడా షోలో గానీ, బయట గానీ చెప్పలేదు. అసలు.. ఇప్పటి వరకూ బాలకృష్ణ కుమార్తెకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. సైలెంట్‌గా వ‌చ్చిన‌ తేజస్విని తొలి స్టెప్‌లోనే.. సక్సెస్ ఫుల్ అయ్యారు. ఇప్పుడు తేజస్విని నిర్మాతగా మారబోతున్నట్లు సమాచారం. తన తండ్రి బాలకృష్ణ హీరోగా తేజస్విని ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే డైరెక్టర్ ని ఫైనల్ చేయబోతున్నారు.