Premalu OTT: మలయాళీ సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై, పెద్ద హిట్ అందుకున్న మూవీ ‘ప్రేమలు’. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని ఆదరణ లభిస్తోంది. సుమారు రూ.3 కోట్ల బడ్జెట్‍ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగా వసూళు చేసింది. ఫిబ్రవరి 9న విడుదల కాగా, ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. త్వరలో ఈ మూవీ తెలుగులోనూ విడుదలకు రెడీ అవుతోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళీ ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా, త్వరలో తెలుగులోనూ థియేటర్లలో ఆకట్టుకోబోతోంది.


‘ప్రేమలు’ ఓటీటీ డీప్ కంప్లీట్


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమా ఓటీటీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‍ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా రైట్స్ కోసం డిస్నీ+ హాట్‍ స్టార్ భారీ మొత్తం వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే, ఎంతకు కొనుగోలు చేసింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు.   


ఓటీటీ విడుదల ఇప్పట్లో లేనట్టే?


‘ప్రేమలు’ మూవీ విడుదలై నాలుగు వారాలు దగ్గరవుతోంది. నిజానికి ఇటీవల చాలా సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. అయితే, ‘ప్రేమలు’ సినిమా థియేటర్లలో చక్కగా రన్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   


తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యేనా?   


ఇక ‘ప్రేమలు’ సినిమాలో  నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ లో కొనసాగుతుంది. తెలుగు వెర్షన్ మూవీకి ఈ పాయింట్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 8న ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.


Read Also: రాశీఖన్నా.. ‘ది సబర్మతి రిపోర్ట్‌’ టీజర్: గోద్రా ఘటన ప్రమాదం కాదు, అసలు నిజం ఏమిటీ?