ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్లలేని, వెళ్లడం ఇష్టపడని వారి దగ్గరికే సినిమాలు తీసుకొస్తోంది. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న సినిమా అయినా, అది ఎన్ని కోట్లు కొల్లగొట్టినా ఏదో ఒకరోజు కచ్చితంగా ఓటీటీలో విడుదల అవుతుందిలే అనే నమ్మకం ఏర్పడుతోంది. దానివల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందని కొందరు వాదిస్తున్నా.. మరికొందరు మాత్రం మంచి టాక్ వస్తే ఏ సినిమాకు అయినా థియేటర్లలో ఆదరణ లభిస్తుందని అంటున్నారు. ఎలా అయినా కూడా ప్రతీ వారం ప్రతీ ఓటీటీలో ఏదో ఒక్క చిత్రం అయినా విడుదల అవుతూనే ఉంది. ఇక ఈ వారం రెండు తెలుగు సినిమాలు రెండు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..


శుక్రవారం థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతున్నట్టుగానే.. ఓటీటీలో ఏదో ఒక సినిమా విడుదల అవుతూనే ఉంది. ఇక ఈ శుక్రవారం (ఆగస్ట్ 4)న కూడా ఓటీటీలో విడుదలకు రెండు తెలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి నాగశౌర్య నటించిన ‘రంగబలి’ అయితే మరొకటి తిరువీర్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘పరేషాన్’.


రంగబలి..
నాగశౌర్య, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటించిన ‘రంగబలి’.. జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లలో కామెడీతో పాటు యాక్షన్‌ను కూడా కలిపి కమర్షియల్ ఆడియన్స్‌ను ఆకర్షించే ప్రయత్నం చేసింది మూవీ టీమ్. అంతే కాకుండా ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. ‘రంగబలి’లో కమెడియన్ సత్య చేసిన కామెడీ సినిమాకు ప్రాణం పోసింది అన్న ఒక్క పాజిటివ్ విషయం తప్ప ఇంకే ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయలేకపోయాయి. పవన్ బసమెట్టి ‘రంగబలి’ చిత్రంతో గ్రాండ్‌గా డైరెక్టర్‌గా డెబ్యూ ఇవ్వాలని కన్న కలలు అన్ని సినిమా ఫెయిల్యూర్‌తో కలలుగా మిగిలిపోయాయి. అందుకే విడుదలయ్యి నెల రోజులు కూడా కాకుండానే ‘రంగబలి’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.


పరేషాన్..
అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా కూడా ‘మసూద’ అనే ఒక్క హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన నటుడు తిరువీర్. తెలుగులో మంచి హారర్ సినిమాలు వచ్చి చాలాకాలం అవ్వడంతో ‘మసూద’కు విపరీతమైన పాపులారిటీ లభించింది. అదే సినిమాలో తిరువీర్ పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అందుకే తిరవీర్‌తో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ముందుకొచ్చారు. రానా లాంటి స్టార్ హీరో సైతం తన సినిమాను ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చాడు. ‘పరేషాన్’ లాంటి చిత్రాన్ని ప్రెజెంట్ చేశాడు. థియేటర్లలో విడుదలయినప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘పరేషాన్’కు మంచి మార్కులే పడ్డాయి. రూపక్ రోనాల్డ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సింగరేణిలో ఉండే కుర్రాళ్ల జీవితకథను కామెడీ వేలో ప్రెజెంట్ చేసినందుకు డైరెక్టర్ కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 4న సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. 


Also Read: ఈ కొరియా హార్రర్ మూవీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial