వైవిధ్యమైన క్యారెక్టర్లలో విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు తిరువీర్ (Thiruveer). వెండితెర, డిజిటల్ తెర అని ఏ మాత్రం తేడాలు లేకుండా మంచి క్యారెక్టర్లు, సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది 'మసూద'తో భారీ విజయం అందుకున్నారు. ఈ ఏడాది 'పరేషాన్'తో ఫుల్ ఫన్ అందించారు. 'టక్ జగదీష్'లో విలన్ రోల్ కూడా చేశారు. ఆల్రెడీ ఓటీటీలో 'సిన్' వెబ్ సిరీస్, 'మెట్రో కథలు' యాంథాలజీ చేసిన ఆయన... లేటెస్టుగా మరో ఓటీటీ ప్రాజెక్టుకు సంతకం చేశారు. 


ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'మిషన్ తషాఫి'
'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru). ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ 'మిషన్ తషాఫి' (Mission Tashafi). ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 కోసం రూపొందుతున్న ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ ఇది. ఫిల్మ్ రిపబ్లిక్ పతాకంపై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో తిరువీర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇంతకు ముందు 'ఈ నగరానికి ఏమైంది', 'బొంబాట్', 'పాగల్', 'శెహరి' సినిమాల్లో ఆవిడ కథానాయికగా నటించారు.  


ఈ  రోజు తిరువీర్ పుట్టినరోజు (Thiruveer Birthday). ఈ సందర్భంగా నేడు 'మిషన్ తషాఫి'లో ఆయన నటిస్తున్నట్లు 'జీ 5' ఓటీటీ వేదిక అనౌన్స్ చేసింది. ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'మిషన్ తషాఫి' అని యూనిట్ పేర్కొంది.  


Also Read : ఆగస్టులో కాదు, లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే? అదీ ఎక్కడంటే?


'మిషన్ తషాఫి' కథ ఏమిటంటే?  
ఇండియాలో భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకు, ఇండియన్ 'రా' ఏజెంట్లకు మధ్య నడిచే భావోద్వేగభరితమైన హై ఇంటెన్స్ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ 'మిషన్ తషాఫి'. ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఓటీటీలో ఎవ‌రూ నిర్మించని రీతిలో భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో జీ 5 ఓటీటీ వేదిక, ప్రణతి రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. అంతే కాకుండా... ఇప్ప‌టి వ‌ర‌కు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకోలేదని, తొలిసారి 'మిషన్ తషాఫి' కోసం విదేశాల్లో కూడా చిత్రీకరణ చేస్తున్నామని ప్రణతి రెడ్డి తెలిపారు. ఇంకా ఈ సిరీస్ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ నేతృత్వంలో ప్రవీణ్ సత్తారు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారని తెలిపారు.


Also Read : ఫ్యాన్స్‌ను భయపెడుతున్న మహేష్ బాబు ఫారిన్ టూర్లు



తిరువీర్‌, సిమ్రాన్ చౌద‌రి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, భూష‌ణ్ క‌ళ్యాణ్ త‌దిత‌రులు 'మిషన్ తషాఫి'లో ప్రధాన తారాగణం. ఈ వెబ్ సిరీస్  ఛాయాగ్రాహకుడు : న‌రేష్ రామ‌దురై, కళ :  సాయి సురేష్‌, కూర్పు :  ధ‌ర్మేంద్ర కాక‌రాల‌,నిర్మాణ సంస్థ :  ఫిల్మ్ రిప‌బ్లిక్‌, నిర్మాత‌:  ప్ర‌ణ‌తి రెడ్డి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial