Madhuri Dixit: ఒకప్పుడు హీరోయిన్లుగా వివిధ పాత్రలతో, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన నటీమణులు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. సౌత్‌లో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు టాప్ స్టార్లతో యాక్ట్ చేసిన నటీమణులు.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తూ సెటిల్ అయిపోయారు. అందులో మాధురీ దీక్షిత్ కూడా ఒకరు. ఈ సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఒక విభిన్న పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు మాధురీ.


అధికారిక ప్రకటన లేదు..


ఈరోజుల్లోనే యంగ్ యాక్టర్లతో పాటు సీనియర్ యాక్టర్లు కూడా ఎక్కువగా వెబ్ సిరీస్‌లలో నటించడానికి మొగ్గుచూపుతున్నారు. అలా ఎక్కువమంది ప్రేక్షకులకు వారి ఎంటర్‌టైన్మెంట్ రీచ్ అవుతుందని నమ్ముతున్నారు. అందుకే మాధురీ దీక్షిత్ కూడా వెబ్ సిరీస్ వరల్డ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. ‘మిసెస్ దేశ్‌పాండే’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించనున్నారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో మాధురీ దీక్షిత్ ఒక సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించనున్నారనే వార్త బాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది.


అదే కథ..


బాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పోలీసులు ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడం కోసం మరొక సీరియల్ కిల్లర్‌ను రంగంలోకి దించుతారు. ఆ సీరియల్ కిల్లర్ కదలికలను గమనించి మరొకరిని పట్టుకుంటారు అనేది ‘మిసెస్ దేశ్‌పాండే’ కథ. ఇది ఒక ఫ్రెంచ్ వెబ్ సిరీస్‌కు రీమేక్ అని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొన్నిరోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం మాధురీ దీక్షిత్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యిందని, ఇతర క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మాధురీ దీక్షిత్ లాంటి స్టార్ హీరోయిన్‌ను ఇలాంటి ఒక డార్క్ రోల్‌లో చూపించడం కోసం టీమ్ అంతా ఎగ్జైటింగ్‌గా ఉందట.


విద్యా బాలన్‌తో పోటీ..


నగేశ్ కుకునూర్ ఇదివరకు ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’, ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’కు దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం మాధురీ దీక్షిత్ కూడా ‘భూల్ భూలయ్యా 3’తో బిజీగా ఉన్నారు. ఇందులో కార్తిక్ ఆర్యన్, తృప్తి దిమ్రీ, విద్యా బాలన్‌తో పాటు మాధురీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో విద్యా బాలన్‌కు, మాధురీకి మధ్య డ్యాన్స్ పోటీ కూడా జరగనుందని సమాచారం. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో ‘మిసెస్ దేశ్‌పాండే’లో మాధురీ సీరియల్ కిల్లర్‌గా నటిస్తుందనే వార్త తన ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. మొత్తానికి చాలారోజుల తర్వాత మాధురీ దీక్షిత్‌ను ఒక ఫుల్ లెన్త్ రోల్‌లో చూడనున్నామని సంతోషిస్తున్నారు.



Also Read: ‘హమ్ ఆప్కే హై కౌన్’కు 30 ఏళ్లు - బ్లాక్ టికెట్లు అమ్మేవాడి జీవితాన్ని మార్చేసిన సినిమా ఇది