తమిళ హీరో కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా దీపావళికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వాటర్ మాఫియా నేపథ్యంలో స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఆహాలో నవంబర్ 18వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు.


దీపావళికి విడుదల అయిన సినిమాల్లో 'సర్దార్' మంచి పేరుతో పాటు కలెక్షన్లు కూడా తెచ్చుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల మార్కును దాటిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఈ సినిమా విమర్శలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. చెన్నైలో జరిగిన 'సర్దార్' సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.  దీనికి కూడా పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు.


కార్తీ చేతిలో మూడు సీక్వెల్స్!
'సర్దార్ 2' కాకుండా కార్తీ చేతిలో మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. అందులో ముందు చెప్పుకోవాల్సింది 'ఖైదీ 2' గురించి! లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'ఖైదీ' చిత్రానికి తమిళంలో, తెలుగులో మంచి వసూళ్లు వచ్చాయి. అంతకు మించి పేరు వచ్చింది. కమల్ హాసన్ 'విక్రమ్' పతాక సన్నివేశాల్లోనూ 'ఖైదీ'లో కార్తీ ఢిల్లీ పాత్రను చూపించారు. 'ఖైదీ 2' ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తైన తర్వాత 'ఖైదీ 2' ఉండొచ్చు. 


కార్తీ చేతిలో ఉన్న మరో సీక్వెల్ 'పొన్నియిన్ సెల్వన్ 2'. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. ఆయనతో పాటు విక్రమ్, 'జయం' రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రభు, లాల్, శరత్ కుమార్ తదితరులు నటించారు. 'పొన్నియిన్ సెల్వన్' పార్ట్ 1 సెప్టెంబర్ 30న విడుదల అయ్యింది. ఆల్రెడీ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. దీంతోపాటు యుగానికి ఒక్కడు సీక్వెల్‌లో కూడా కార్తీ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.