ETV Win Sopathulu OTT release date: పల్లెటూరు కథలతో తెరకెక్కి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ దక్కించుకుంటాయి. రీసెంట్ గా వచ్చిన ‘90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ లాంటి వెబ్ సిరీస్, ‘మేమ్ ఫేమస్’ లాంటి సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సోపతులు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఈటీవీ విన్ లో విడుదలకాబోతోంది. ఈ సినిమాకు అనంత్ వర్దన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ ట్రైలర్ చివరలో మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేశారు.  


ఆకట్టుకున్న ‘సోపతులు’ ట్రైలర్


‘సోపతులు’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. తెలంగాణలోని ఓ పల్లెటూరులో ఈ సినిమా కథ కొనసాగుతుంది. స్కూల్ పిల్లల చిలిపి గొడవతో మొదలు అయిన ట్రైలర్... తర్వాత ఆ పిల్లల ఆట పాటలతో హ్యాపీగా జాలీగా సాగింది. ఈ సినిమా కథ కరోనా కాలంలో నడుస్తుంది. కరోనా లాక్ డౌన్ విధించడంతో స్నేహితులు విడిపోతారు. ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్లు కొనేందుకు తల్లిదండ్రులు పడ్డ ఇబ్బందులు సహా, కరోనా కష్టకాలంలో ప్రజలు పడ్డ అవస్థలను ఇందులో ప్రస్తావించారు. ఈ సినిమా ట్రైలర్ చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేస్తూ ఆకట్టుకుంది. పిల్లల కామెడీ, స్నేహం, అమాయకత్వం, భావోద్వేగాలను ఇందులో చక్కగా చూపించారు. ఈ సినిమాలోని సంభాషణలు అన్నీ తెలంగాణ మాండ‌లికంలో ఆకట్టుకుంటున్నాయి. అందరినీ న‌వ్విస్తూనే హృద‌యాల్ని క‌దిలించే భావోద్వేగాల‌తో ఈ మూవీ కథ కొనసాగుతోంది. కల్లు కుండలో పాలసుక్క లాంటి సినిమా అంటూ ట్రైలర్ చివరలో చిత్రబృందం ప్రకటించింది.   



ఇక సోపతులు సినిమాలో భాను ప్రకాశ్, శృజన్, మోహన్ భగత్, మణి అయిగుర్ల, అనూష రమేశ్, అంజయ్య మిల్కూరి, సురభి లలిత, నిమ్మనగోటి పద్మ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న మోహ‌న్ భ‌గ‌త్  శ్రీకేరాఫ్ కంచెర‌పాలెం’, ‘ఆరంభం’తో పాటు పలు సినిమాల్లో నటించాడు. మ‌ణి అగుర్ల ‘మేమ్ ఫేమ‌స్‌’, ‘మెయిల్’ లాంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ‘సోప‌తులు’ సినిమాకు సింజీత్ ఎర్ర‌మ‌ల్లి మ్యూజిక్ అందిస్తున్నారు.



రీసెంట్ గా ఈటీవీ విన్ లో విడుదలైన ‘వీరాంజ‌నేయులు విహార యాత్ర’ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. ఎమోషనల్ కథాశంతో కొనసాగిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడు ‘సోపతులు’ సినిమా కూడా ప్రేక్షకుల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆకట్టుకుంటుందని మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ మేరకు ఈటీవీ విన్ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 


Also Read: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు