నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌ స్టాప‌బుల్‌' టాక్ షో తొలి ఎపిసోడ్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు లక్ష్మీ మంచు, విష్ణు మంచు వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని గెస్టుగా వచ్చారు. ఇప్పుడో మూడో ఎపిసోడ్ కి అతిథులుగా బ్రహ్మానందం, అనీల్ రావిపూడి ఇద్దరూ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
  

 

ముందుగా బాలయ్య.. 'మూడు వారాలు గ్యాప్ వచ్చింది.. వారం వారం రావడానికి నేను సీరియల్ కాదూ.. సెలబ్రేషన్..' అంటూ ఎంట్రీ ఇచ్చేశారు. 'ఎన్ని కష్టాలు వచ్చినా.. నవ్వడం ఆపొద్దు.. నవ్వించడం ఆపొద్దు' అంటూ అనీల్ రావిపూడిని ఇన్వైట్ చేశారు. స్టేజ్ పైకి వచ్చిన అనీల్ రావిపూడితో 'ఎఫ్2' సినిమాలో వెంకీ ఆసన వేశారు బాలకృష్ణ. 

 

'మెహం చూడగానే నవ్వొచ్చే ఫేసు.. ఆ ఫేసు ఎవరిదో మీకు బాగా తెలుసు అని చెప్పగా..' బ్రహ్మానందం స్టేజ్ పైకి వచ్చారు. అలా వచ్చిన బ్రహ్మీ.. బాలయ్యను కౌగిలించుకున్నారు. దానికి బాలయ్య 'ఇప్పుడు మీరు నాకు హగ్ ఇచ్చారా..? లేక నేను మిమ్మల్ని కౌగిలించుకున్నానా..?' అని ప్రశ్నించగా.. 'ముందు మీరు నాకు హగ్ ఇచ్చారు. ఆ తరువాత నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది' అంటూ 'మన్మథుడు' సినిమాలో కామెడీ డైలాగ్ కొట్టాడు. 

 

షో మధ్యలో అనీల్, బ్రహ్మానందంలతో కలిసి బాలయ్య కూడా కామెడీ చేశారు. ఆ సమయంలో బ్రహ్మానందం.. 'బాలకృష్ణ గారు కూడా కామెడీ చేస్తారు కానీ కమెడియన్ కాదు.. సింహం' అంటూ డైలాగ్ కొట్టగా.. వెంటనే బాలయ్య గర్జించుకుంటూ బ్రహ్మానందం దగ్గరకు వెళ్లారు. మాటల మధ్యలో ఎప్పటిలానే బాలయ్య పెగ్ టాపిక్ తీసుకొచ్చారు. 'పావుగంటకు ఒక పెక్(పలకరింపు) ఉంటుంది. రాత్రికి ఒక పెగ్ ఉంటుంది' అని బాలయ్య అనగా.. 'అంతకంటే ఇంకేం కావాలి సార్' అని బ్రహ్మీ బదులివ్వగా.. అందరూ నవ్వేశారు. ఆ తరువాత మన సినిమాలో బ్రహ్మానందం గారు నటిస్తారు కదా.. అని అనీల్ రావిపూడిని బాలయ్య అడగ్గా.. మధ్యలో బ్రహ్మీ ఇన్వాల్వ్ అయ్యారు. వెంటనే బాలయ్య గట్టిగా అరుస్తూ ప్రోమోలో కనిపించారు. అది కూడా షోలో భాగమని తెలుస్తోంది.