కరోనా కారణంగా ఎన్నో ఇండస్ట్రీలు కుదేలవుతున్నాయి.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై ఈ వైరస్ దారుణమైన ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ కారణంగా వేసుకున్న ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. థియేటర్లలో సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి. ఇప్పటివరకు సినిమా అంటే థియేటర్లోనే విడుదల చేయాలనే ఫీలింగ్ అందరిలో ఉండేది. ఆలస్యమైనా సరే.. నేరుగా థియేటర్లోనే సినిమాలను విడుదల చేసేవారు. గతంలో కమల్ హాసన్ లాంటి వారు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. 



కానీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అనేది మంచి ఆప్షన్ గా మారింది. ఏడాదికి వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యేవి. దీంతో కొంతమందికి థియేటర్లు దొరికేవి కాదు. పైగా థియేటర్లన్నీ కూడా కొందరు పెద్దల చేతుల్లో ఉండడంతో.. వాళ్ల అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఏ సినిమా ఎన్నిరోజులు ఏ థియేటర్లో ఉండాలో వాళ్లే నిర్ణయించేవారు. పండగ సీజన్లు, హాలిడే సీజన్లలో స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ జరిగేది. ఇప్పుడు స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలకు ఓటీటీ అనేది బెస్ట్ ఆప్షన్ గా మారింది. 



ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లో విడుదల చేస్తే ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్లకు వస్తారనే సందేహాలు ఉన్నాయి. పైగా ఏపీలో ఇంకా టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం కచ్చితంగా థియేటర్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అధికారికంగా ఉన్న టికెట్ ధరలతో కొందరు ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. 



రిపీటెడ్ ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. ఇక క్యాంటీన్ లో తినుబండారాల రేట్లు చూస్తే ఎవరికైనా హార్ట్ ఎటాక్ రావాల్సిందే. ఆ రేంజ్ లో తమకు నచ్చిన రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా.. థియేటర్ యాజమాన్యాలు మాత్రం మారలేదు. ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి రావడంతో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లను, క్యాంటీన్ బాదుడుని భరించాల్సిన అవసరం లేకుండాపోయింది. అందరూ అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో సభ్యత్వం తీసుకుంటూ ఇంట్లో ఉంటూనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా థియేటర్ వ్యవస్థకు పెద్ద దెబ్బే. 



ఇక రీసెంట్ గా పేరున్న సినిమాలను సైతం ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు. వెంకటేష్ నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' లాంటి సినిమాలు ఓటీటీల్లోనే రానున్నాయి. ఇదే బాటలో మరికొన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ సమస్యల నుండి థియేటర్ యజమానులు ఎలా బయటపడతారో చూడాలి!


Also Read:


Nayanthara OTT Debut : 'బాహుబలి'తో నయనతార ఓటీటీ ఎంట్రీ!