NTR30 Update: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్30 అప్‌డేట్‌ను రేపు (మార్చి 6వ తేదీ) అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథా నాయకగా నటించనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. రేపు జాన్వీ కపూర్ పుట్టిన రోజు. కాబట్టి తనను ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేస్తున్న అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.


'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తర్వాత తనకు రచయితగా 'బృందావనం', దర్శకుడిగా 'జనతా గ్యారేజ్' వంటి విజయవంతమైన సినిమాలు అందించిన కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని ముందు నుంచి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి భారీ ప్లానింగ్ జరుగుతోంది.


ఆస్కార్ అవార్డ్స్ కోసం సోమవారం ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్ళనున్నారు. లాస్ ఏంజిల్స్ వెళ్లిన తర్వాత హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో సమావేశం అవుతారట. ఆ తర్వాత అక్కడి స్టంట్ మాస్టర్లతో కూడా డిస్కషన్స్ చేస్తారట. ఎన్టీఆర్ 30 కోసమే ఆ డిస్కషన్ అని, త్వరలో వాళ్ళ వివరాలు వెల్లడిస్తారని సమాచారం.


ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఫిబ్రవరి 24న లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే, నందమూరి తారక రత్న మరణం కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్న విధంగా స్టార్ట్ కానుందట. ఎన్టీఆర్ 30వ చిత్రమిది. అందుకని, ఎన్టీఆర్ 30గా వ్యవహరిస్తున్నారు. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎన్టీఆర్ స్వయంగా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.


ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లేదా విక్రమ్ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు.


నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.