బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ఛీటింగ్ కేసు నమోదు కాగా.. ఇప్పుడు నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది కోర్టు. అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోకి మొరాదాబాద్ సిటీలో క‌ట్‌ఘ‌ర్ అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి సోనాక్షి సిన్హాకు వ్యతిరేకంగా కేసు పెట్టారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రమోద్ శర్మ ఒప్పుకున్నారు. 

 

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకి రూ.37 లక్షలను అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు. కానీ ఆమె ఈవెంట్ కి హాజరు కాలేదు. దీంతో తన డబ్బుని తిరిగి ఇవ్వాలని ప్రమోద్ శర్మ.. సోనాక్షి సిన్హా మేనేజర్ ను కోరారు. దానికి ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. ప్రమోద్ శర్మ చాలా సార్లు వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

 

దీంతో ఆయన సోనాక్షి సిన్హాకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. కేసు విచారణ కోసం సోనాక్షి సిన్హా మొరాదాబాద్ కోర్టుకి హాజ‌రు కావాల్సి ఉంది. కానీ ఆమె కోర్టుకి రాలేదు. దీంతో స్థానిక కోర్టు సోనాక్షి సిన్హాపై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. మరి దీనిపై సోనాక్షి సిన్హా ఎలా స్పందింస్తుందో చూడాలి. 'దబాంగ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'డబుల్ ఎక్స్ ఎల్' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.