‘అఖండ’ లాంటి సినిమాతో దుమ్మురే హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా మరో సినిమాలో నటిస్తున్నారు. మాస్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి 107వ  సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసింది. బాలయ్య బర్త్ డే కానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పోలీసు అధికారిగా కనిపించనున్నారు. బాలయ్య ఇప్పటి వరకు పోలీసుగా నటించిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.  


కొండారెడ్డి బురుజు సాక్షిగా టైటిల్ లాంచ్


తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ డూపర్ అప్ డేట్ వచ్చింది.  మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ వివరాలను చిత్ర బృందం వెల్లడించింది. NBK 107 టైటిల్‌ ను కర్నూలు వేదికగా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిపారు. కొండారెడ్డి బురుజు సాక్షిగా అక్టోబర్ 21 రాత్రి 8.15 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను వెల్లడించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్స్ ఇవేనంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ‘రెడ్డిగారు’ కాగా, మరొకటి ‘జై బాల‌య్య’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చ నడుస్తున్నది. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఫైనల్ అవుతుందని సమాచారం.    


కీలక పాత్రల్లో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీలో నటసింహం రెండు గెటప్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నారట. ఇందులో కూడా తను పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ, మలినేని కాంబోలో వచ్చిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా నటించిన వరలక్ష్మీ.. తన నటనతో అదరగొట్టింది. ఈ తాజా సినిమాలోనూ బాలయ్యను ఎదిరించే లేడీగా కనిపిస్తుందట.


‘అఖండ’ రిలీజ్ రోజునే విడుదలవుతుందా?


మరోవైపు బాలయ్య తాజా సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు, ఈ మూవీని సైతం ‘అఖండ’ విడులైన రోజునే అంటే, డిసెంబర్ 2న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఈ  డేట్ ఫిక్స్ కాకపోతే సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్‌పై నిర్మితం అవుతుంది. ఎస్ఎస్ తమన్​ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్ NBK-2’ పేరుతో టాక్ షో నిర్వహిస్తున్నారు. సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ అదరగొడుతున్నారు.


Read Also: ‘బాహుబలి-2’లోని ఆ సీన్‌ను దించేసిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్’ వెబ్ సీరిస్, ఇండియన్ డైరెక్టర్ పనే!