నారా రోహిత్ హీరోగా 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. రోహిత్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో అది కూడా ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ‘ప్రతినిధి 2’ సినిమాను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 జనవరి 25వ తేదీన రిపబ్లిక్ డే వీకెండ్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.


గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను #NaraRohit19 పేరిట ప్రచారం ప్రారంభించారు. సోమవారం టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్‌ను కూడా అనౌన్స్ చేశారు. ‘ప్రతినిధి’ని ఫ్రాంచైజీలా మారుస్తామని, ఈ సిరీస్‌లో రానున్న రెండో సినిమా ఇదని నిర్మాతలు ప్రకటించారు. ‘ప్రతినిధి 2’కు “One man will stand again, against all odds,” అనేది క్యాప్షన్‌లా పెట్టారు. అంటే ఈసారి కూడా వ్యవస్థపై వ్యక్తి యుద్ధం అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కనుందని అర్థం చేసుకోవచ్చు. 


జర్నలిస్టు మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గానూ, రవితేజ గిరిజాల ఎడిటర్‌గానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు.


ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం, దేశ విధి విధానాలను మార్చేసే డిమాండ్లను చేయడం 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ కథాంశం. ఈసారి కూడా పొలిటికల్ సబ్జెక్టుతోనే ‘ప్రతినిధి 2’ తెరకెక్కుతుందని నిర్మాతలు తెలిపారు. చెయ్యెత్తిన నారా రోహిత్‌ను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూడవచ్చు. నారా రోహిత్ ఫొటో మొత్తాన్ని న్యూస్ పేపర్లతో డిజైన్ చేశారు. మొత్తమ్మీద మంచి అంచనాలతో సినిమా కోసం ఎదురు చూసే ఆసక్తి క్రియేట్ చేయడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు.


2024 మొదటి రెండు నెలల్లోనే రెండు పొలిటికల్ సినిమాలు హల్‌చల్ చేయనున్నాయి. జనవరి 25వ తేదీన ‘ప్రతినిధి 2’ రానుండగా, ఫిబ్రవరిలో వైఎస్ జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ విడుదల కానుంది. రానున్న కాలంలో మరెన్ని పొలిటికల్ సినిమాలు పట్టాలెక్కుతాయో, ఎన్ని విడుదల అవుతాయో చూడాలి.


ఐదేళ్ల గ్యాప్ తర్వాత...
ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత నారా రోహిత్ ప్రేక్షకుల ముందు వస్తుండటం విశేషం. 2018లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత నారా రోహిత్ సినిమా ఏదీ విడుదల కాలేదు. ‘అనగనగా దక్షిణాదిలో’, ‘శబ్దం’ అనే సినిమాలు ప్రారంభం అయినా అవి ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ ‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.