నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ షోలో ఈ వారం హీరోలు ప్రభాస్, గోపీచంద్‌లు పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి ‘ఆహా’ ఓటీటీ మరో ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్‌ల సరదా సంభాషణలు, చమత్కారాలను చూపించారు. 


బాలయ్య మాట్లాడుతూ.. ‘‘నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతులుగా మారిపోతారు. నేను నీ మాయలో పడిపోయాను’’ అని అన్నారు. ఆ తర్వాత.. ‘‘ఏంటీ పెళ్లి ఉందా? లేదా? అసలు?’’ అని అడిగారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘రాసిపెట్టి లేదు సార్’’ అని అన్నారు. దీంతో బాలయ్య ‘‘మీ అమ్మకు చెప్పిన మాటలు చెప్పకయ్యా’’ అని అన్నారు. నిన్ను ఎక్కువగా నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారని బాలయ్య అడిగితే.. ‘‘డార్లింగ్’’ అనే పిలుస్తారని ప్రభాస్ సమాధానమిచ్చారు. మరి ‘‘గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు?’’ అని అనే ప్రశ్నకు మాత్రం ప్రభాస్ తెలివిగా.. ‘‘అదేదో టాబ్లెట్ వేసుకుంటున్నా సార్, మరిచిపోతున్నా ఈ మధ్యన’’ అని బదులిచ్చారు. 


‘‘2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవపడ్డారు’’ అని బాలయ్య అడిగితే.. గోపీచంద్ ‘‘2008 కాదు సార్ అది’’ అని చెబుతుంటే.. ప్రభాస్ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. షోలో భాగంగా బాలకృష్ణ.. హీరో రామ్ చరణ్‌కు ఫోన్ చేశారు. ‘‘సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు, తర్వాత మీ నాన్నగారి సినిమాకు వెళ్లు’’ అని అనడంతో ప్రోమో ముగిసింది. ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న, ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల కానున్నాయి.






‘అన్‌స్టాపబుల్-2’ షోలో ప్రభాస్, గోపీ చంద్‌ల ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి భాగాన్ని డిసెంబరు 30న, రెండో భాగాన్ని జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ప్రభాస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు గురూజీ వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా ఆ ఎపిసోడ్ విడుదల కానుందని సమాచారం. ఆహా వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


Also Read: మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?