తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి విద్యార్థులకు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి తెలిపారు. పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సబిత డిసెంబరు 28న తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదోతరగతి బోర్డు పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయాన్ని కేటాయిస్తున్నామన్నారు. వంద శాతం సిలబస్‌తో పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 


పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని తెలిపారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


పరీక్షల షెడ్యూలు ఇలా..


ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి.  


కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పది వార్షిక పరీక్షల పేపర్లను 11 నుంచి ఆరుకు కుదించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను  చెరో రెండు పేప‌ర్లుగా పరీక్షలు నిర్వహించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష నిర్వహించేవారు. తాజా ఉత్తర్వుల మేరకు ఇక నుంచి 6 పేపర్లతోనే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.


6 పేపర్లతోనే పరీక్ష.. అధికారిక ఉత్తర్వులు జారీ..
పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో టెన్త్ లో 11 పేపర్లు ఉండగా..  వాటి సంఖ్యను ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పది వార్షిక పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. 2022-23 నుంచి పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


తొమ్మిదో తరగతికి ఆరు పేపర్లే...
పదోతరగతితోపాటు తొమ్మిదో తరగతి పరీక్షల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై 9వ తరగతి విద్యార్థులకు కూడా 6 పేపర్లతోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..