సినిమాల రివ్యూలకు సంబంధించిన ఇండస్ట్రీ జనాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది రివ్యూలను వ్యతిరేకిస్తున్నారు. సినిమా విడుదలైన కాసేపటికే రివ్యూలను పోస్ట్ చేయడం వలన కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని వాదిస్తున్నారు. రివ్యూలు పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ నెగెటివ్ రివ్యూలు చూసి జనాలు థియేటర్లకు రావడం లేదని.. కాబట్టి సినిమా రిలీజైన మూడు, నాలుగు రోజుల తరువాత రివ్యూలు పోస్ట్ చేయాలంటూ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. 

 

అయితే రివ్యూల మీద ఆధారపడేవారు చాలా మంది ఉన్నారు. వారిలో ఇండస్ట్రీ జనాలు కూడా ఉన్నారు. అందరూ ఈ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ సీనియర్ హీరో నాగార్జున మాత్రం ఒప్పుకున్నారు. తాను ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకుంటే కచ్చితంగా రివ్యూలు చూసే డిసైడ్ అవుతానని అన్నారు. ఒకప్పుడు సినిమా రివ్యూలు వారం తరువాత పత్రికలు, మ్యాగజైన్స్ లో వచ్చేవని.. అప్పటికి సినిమా ఉందో, లేదో కూడా చాలా మందికి తెలిసేది కాదని నాగార్జున అన్నారు. 

 

అందుకే అప్పుడు రివ్యూలను పెద్దగా పట్టించుకునేవారు కాదని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయాయని.. సోషల్ మీడియా, వెబ్ సైట్స్ పెరిగిన తరువాత రివ్యూలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. సినిమా టాక్ లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, తను కూడా సినిమాలు-వెబ్ సిరీస్ లు చూడాలంటె ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తానని అన్నారు. ఏదైనా ఎక్కువ రేటింగ్ ఉంటేనే చూస్తానని.. లేదంటే టైం వేస్ట్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. 

 

ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'ది ఘోస్ట్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే... అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అనేది అర్థం అవుతోంది. తెలుగులో నాగార్జున మాజీ ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ చేస్తుండగా... హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఏజెంట్ తరహా రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో చూస్తే తెలుస్తుంది. 

నాగ్ సినిమా చెప్పిన టైంకే:
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రావడం మంచిది కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాగార్జున వెనక్కి తగ్గుతారని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది 'ది ఘోస్ట్' టీమ్. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు చెబుతున్నారు. మరోసారి రిలీజ్ డేట్ ప్రకటన చేయాలనుకుంటున్నారు. అంటే బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదేమో!