రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కు మూగ జీవాలు అంటే ప్రాణం. వీధి శునకాలను దత్తత తీసుకోమని, డబ్బులు పోసి పెంపుడు జంతువులను షాపుల్లో కొనవద్దని ఆమె ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. మాంసాహార ఉత్పత్తుల కోసం జంతువులను బలి ఇవ్వడం... వినోదం కోసం మూగ జీవాలను హింసించడం చేయవద్దని ప్రజలను విజ్ఞప్తి చేస్తుంటారు. కరోనా సమయంలో మూగ జీవాలకు ఆహారం ఇవ్వడం కోసం వీధుల్లో రష్మీ గౌతమ్ తిరగడం అందరికీ తెలిసిన విషయమే.


పాల ఉత్పత్తులకు కోడె దూడలు పనికిరావు కనుక వాటిని చంపుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన నెటిజన్, వీగన్‌గా మారమని కోరారు. డైరీ ఇండస్ట్రీ హ్యాష్ ట్యాగ్‌తో ఆ వీడియో కోట్ చేశారు రష్మీ. తనను తాను రాహుల్ గాంధీ అభిమానిగా పేర్కొన్న వరప్రసాద్ అనే నెటిజన్... వీధి శునకాలకు చిన్న దెబ్బ తగిలితే స్పందించే రష్మీ ఇప్పుడు ఎందుకు మూగబోయింది? అని ట్విట్టర్ రిప్లైలో ప్రశ్నించారు. ''నన్ను విమర్శించే బదులు మీ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్స్ దగ్గరకు వెళ్లి వాళ్ళకు మానవత్వం గురించి వివరించవచ్చు కదా'' అని రష్మీ బదులు ఇచ్చారు.


Rashmi Gautam Vs Rahul Gandhi Fan : రష్మీ గౌతమ్ సమాధానంతో సదరు నెటిజన్ సంతృప్తి చెందలేదు. మిల్క్ డైరీ ఫామ్ పెద్ద వ్యాపారం అయినప్పుడు , లాభాలు వస్తున్నప్పుడు మానవత్వం ఎలా ఉంటుందని వరప్రసాద్ మళ్ళీ ఎదురు ప్రశ్నించాడు. సెలబ్రిటీలు పాల ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు. నాగబాబు చేయడం లేదా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్స్ యుద్ధంలో రష్మీకి కొంత మంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు. 


మధ్యలో మోడీని తీసుకొచ్చిన నెటిజన్!
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో డైరీ సెక్టార్‌లో దేశం ఉన్నత శిఖరాలు చేరుకుంటోంది, ప్రగతి పథంలో వెళుతుందని భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన ట్వీట్‌ను రష్మీ ముందు ఉంచాడు. అందుకు ఆమె 'ఆవుల సంరక్షణ సంగతి ఏంటి? ఈ విషయంలో క్లారిఫికేషన్ కావాలి'' అని భారతీయ జనతా పార్టీని ట్యాగ్ చేశారు. అంతే కాదు... ఎవరూ పాల ఉత్పత్తులు వాడకపోతే ప్రొడక్షన్ ఉండదని బదులు ఇచ్చారు.  తనకు అనుకూలంగా సమాధానం చెప్పారని నెటిజన్ మళ్ళీ కవ్వించాడు. అదొక్కటే పరిష్కారమని రష్మీ తెలిపారు. ఇంకా ఇంకా అతడు ప్రశ్నలు వేస్తూ ఉండటంతో సమాధానం ఇవ్వకూడదని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 


Also Read : కాషాయం జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?


బీజేపీని రష్మీ గౌతమ్ ప్రశ్నించడంతో సరైన ప్రశ్న అయినప్పటికీ... చాలా మంది తిట్టే అవకాశం ఉందని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అయితే, ఈసారి అలా చేయరని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు రష్మీ గౌతమ్ ''నన్ను ఎందుకు ద్వేషిస్తారు? నేను నంది, గోమాతను పూజిస్తాను. నా ఉద్దేశం ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను'' అని రిప్లై ఇచ్చారు. అదీ సంగతి! టీవీ కార్యక్రమాలు, సినిమాలలో పాత్రలకు అనుగుణంగా గ్లామరస్ గా కనిపించే రష్మీ... నిజ జీవితంలో వేరుగా కనిపిస్తారు. 


Also Read : మహేష్ బాబు రేంజ్‌కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవ్వడం పక్కా!