ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో మొదలయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకాగానే, ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంశపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు. జాబ్స్ ఎక్కడ జగన్, నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ ప్లకార్డులతో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిపోయిందని టీడీపీ సభ్యులు అన్నారు. నిరుద్యోగ సమస్యలపై టీడీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. జాబ్ రావాలంటే జగన్ పోవాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఉద్యోగాల పేరుతో జ‌గ‌న్ యువ‌త‌ను మోస‌గించార‌ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు మండిప‌డ్డారు.


జగన్ జాబ్స్ ఎక్కడ అని టీడీపీ ప్లకార్డులు.. 
ఉద్యోగాలేవి అని, నిరుద్యోగులకు నగదు ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇవ్వరా అని ప్లకార్డులు పట్టుకువచ్చి ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలు తరువాత అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రతిపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. ఒకనొక దశలో స్పీకర్ పొడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రశ్నోత్తరాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సిగ్గుచేటంటూ అధికార వైసీపీ సభ్యులు దీటుగా బదులిచ్చారు. ప్రశ్నోత్తరాలు చేపట్టిన వెంటనే టీడీపీ సభ్యులు నినాదాలు చేయడం, సభ సజావుగా జరగకుండా అడ్డుకోవడం ఏంటని గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, కానీ టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా సమయం వృథా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సభ పెట్టమంటారు.. సమావేశాలు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. 


టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని, చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ సభ్యులకు ప్రజా సంక్షేమంపై, నిరుద్యోగుల సమస్యలపై చర్చించే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో త్వరలో ప్రజలే టీడీపీ శవయాత్ర చేపడతారని వ్యాఖ్యానించారు. 


ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత వాయిదా తీర్మానంపై చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని చెప్పినా.. టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి వచ్చినట్లు కనిపిస్తున్నారని అధికార వైసీపీ సభ్యులు ఆరోపించారు.


అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత...!
2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీఎస్‍ఎస్‍ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‍గోపాల్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఇతర నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దాంతో పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తెలుగు యువత శ్రేణుల్ని బలవంతంగా తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు పోలీసులు. ఈ క్రమంలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. తెలుగు యువత నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.