Naa Saami Ranga OTT Partner : ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ 'కింగ్' నాగార్జున 'నా సామి రంగ' అంటూ వచ్చాడు. గత రెండేళ్లుగా సంక్రాంతికి థియేటర్లో తన సినిమాల సందడి ఉండేలా చూసుకుంటున్నాడు.  'సొగ్గాడే చిన్నినాయన', 'బంగార్రాజు' ఇలా వరసగా సంక్రాంతికి  తన సినిమాలు విడుదల చేసి పండుగ హీరో అనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది కూడా పండుగకు తన సినిమా సందడి ఉండేలా మూడు నెలల్లోనే షూటింగ్‌ పూర్తి చేసి 'నా సామి రంగ' రిలీజ్‌ చేయించాడు. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకుడిగా మారారు.


అమిగోస్‌ బ్యూటీ ఆషికా రంగనాథ నాగ్‌ సరసన సందడి చేసింది. హీరో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్ర పోషించారు. విడుదలకు ముందు ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌తో మంచి బజ్‌ క్రియేట్‌ చేసుకున్న 'నా సామి రంగ' నేడు జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. కామెడీ, యాక్షన్‌, కమర్షియల్‌ ప్యాకేజ్‌తో పెస్టివల్‌ మూవీ ఫీల్‌ ఇచ్చిందంటున్నారు. కానీ, కథలో బలంగా లేదనే నెగిటివ్ టాక్‌ కూడా వినిపిస్తుంది. అయితే అంచనాలు లేకుండా మూవీ చూస్తే మాత్రం ఎంజాయ్‌ చేయొచ్చు అంటున్నారు ఆడియన్స్‌. 


స్ట్రీమింగ్ అప్పడేనా?


మొత్తానికి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న నా సామిరంగ ఓటీటీ రిలీజ్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా థియేటర్లోకి వచ్చిన సినిమా ఆ తర్వాత ఓటీటీకి రావాల్సిందే. కాబట్టి థియేటర్లోకి వచ్చిన నా సామిరంగ్‌ డిజిటల్‌ పార్ట్‌నర్‌, స్ట్రీమింగ్ గురించి సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం హాట్‌స్టార్‌ మేకర్స్‌కు భారీ మొత్తం చెల్లిందట. ఇక నిబంధనల ప్రకారం 'నా సామిరంగ' ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఓటీటీకి వచ్చే అవకాశం ఉందట. అయితే ఇది ఆ ఓటీటీ సంస్థ, మేకర్స్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంది. అదే విధంగా మూవీ టాక్‌, బాక్సాఫీసు కలెక్షన్స్‌ బట్టి స్ట్రీమింగ్‌ తేదీలో మార్పులు చోటుచేసుకునే చాన్స్‌ ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 'నా సామిరంగ' మాత్రం ఫిబ్రవరి ఎండింగ్ వస్తుందంటున్నారు. అయితే దీనిపై సదరు ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


మూవీ కథ విషయానికి వస్తే..


కిష్టయ్య (నాగార్జున) అనాథ. చిన్నతనంలో అంజి ('అల్లరి' నరేష్) తల్లి అతడిని చేరదీస్తుంది. ఈ క్రమంలో అంజీ తల్లి మరణించడంతో ఇద్దరు ఒకరికొరు తోడుగా ఉంటారు. అన్నదమ్ముల కంటే ఎక్కువగా కిష్టయ్య, అంజి కలిసి మెలిసి ఉంటారు. అనాథలైన వారిద్దరికి చిన్నప్పటి నుంచి అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) సాయం చేస్తాడు. దీంతో ప్రెసిడెంట్‌ పెద్దయ్యను వారిద్దరు అమితంగా గౌరవం ఇస్తారు. కిష్టయ్య అంటే పెద్దయ్య కూడా అంతే ప్రేమ చూపిస్తారు.అదే సమయంలో కిష్టయ్య, వరాలు (ఆషికా రంగనాథ్) ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పడానికి వస్తారు.


వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్ కాళ్లరక్కల్)కి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. కిష్టయ్య, వరాలు ప్రేమ వ్యవహారం తెలిసి కొడుక్కి అనుకున్న సంబంధాన్ని వదిలేస్తాడు పెద్దయ్య. కిష్టయ్యకు వరాలును ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకున్నాడా? తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కిష్టయ్య కోసం తనను వదిలేయడాన్ని ఎంత మాత్రం సహించలేని దాసు ఏం చేశాడు? పొరుగూరు జగన్నపేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారి (రుక్సార్ థిల్లాన్)తో అంబాజీపేట కుర్రాడు భాస్కర్ (రాజ్ తరుణ్) ప్రేమ కారణంగా రెండు గ్రామాల మధ్య ఎటువంటి పరిస్థితి వచ్చింది? కిష్టయ్య, అంజిలను చంపాలనుకున్న దాసు ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా? అనేది సినిమా. 


Also Read: సినీ తారల సంక్రాంతి సందడి.. భోగి సంబరాల్లో జక్కన్న, ఎన్టీఆర్‌, వెంకీ మామ