టాలీవుడ్ టాప్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. గత  కొంత కాలంగా నాగార్జున సరైన హిట్ అందుకోలేకపోయారు. అందుకే తన రీసెంట్ మూవీ  'ది గోస్ట్' సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటించింది.

 

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. గతంలో నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం థియేటర్లలో మెప్పించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ‘ది ఘోస్ట్’ కూడా ఓటీటీలో ఆకట్టుకొనే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంత త్వరగా ఓటీటీ విడుదలకు సిద్ధం కావు. అయితే ‘ది గోస్ట్’ సినిమా అనుకున్నంత వసూళ్లు రాబట్టకపోగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా అందుకోలేకపోవడంతో ముందుగానే ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది.

 

ఈ సినిమాలో నాగార్జున విక్రమ్ పాత్రలో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించారు. ఆయనతో పనిచేసే ప్రియా (సోనాల్ చౌహాన్)తో విక్రమ్ ప్రేమలో పడతాడు. ఓ ఆపరేషన్ లో రౌడీ మూక చేతుల్లో చిన్న పిల్లాడు చనిపోతాడు. ఆ పిల్లాడి మరణం విక్రమ్ ను వెంటాడుతుంది. దీంతో మానసికంగా కుంగిపోతాడు విక్రమ్. ఇదే సమయంలో ప్రియ, విక్రమ్ ని విడిచి వెళ్ళిపోతుంది. తర్వాత విక్రమ్ కు తన సిస్టర్ అను నుంచి ఫోన్ వస్తుంది. తననీ తన కూతుర్ని కాపాడాలని కోరుతుంది. తర్వాత విక్రమ్ వాళ్ళని ఎలా కాపాడాడు, ఎలాంటి ఘర్షణలు జరిగాయి అనేది మిగతా సినిమా.

 

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున యాక్షన్ సీన్స్ లో తన మార్కు చూపించారు. సినిమాలో యాక్షన్ సీన్స్ బానే ఉన్నా కథ, కథనం విషయంలో లోపాలు, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవడంతో సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. అదే సమయంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ‘ది గోస్ట్’ కలెక్షన్లు బాగా పడిపోయాయి. ‘గాడ్ ఫాదర్’కు వారం తర్వాత విడుదలై ఉంటే సినిమా థియేటర్లలో బాగా ఆడేదనే అభిప్రాయం కూడా వెల్లడైంది. 'ది గోస్ట్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 2న ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మంచి పాజిటివ్ టాక్ వస్తుందని ఆశిస్తోంది మూవీ టీమ్. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం సమకూర్చారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌‌గా నటించింది. మరికొందరు కీలక పాత్రలు పోషించారు.