Naga Chaitanya Dhootha Web Series Promotions: ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న హీరో అక్కినేని నాగ చైతన్య, మరోవైపు ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ‘ధూత‘ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ను దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుతోంది. ఇందులో నాగ చైతన్య జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. విడుదలకు రెడీ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో  ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 


డిసెంబర్ 1 నుంచి ‘ధూత‘ స్ట్రీమింగ్


డిసెంబర్ 1 నుంచి ‘ధూత‘ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాగ చైతన్య ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సిరీస్ ప్రమోషన్ కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా తమన్నాతో కలిసి ఫ్రాంక్ వీడియో చేశారు. ప్రస్తుతం మరో కొత్త పంథాను ఎంచుకున్నారు.


ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చై


తన వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య నేరుగా ఫ్యాన్స్ ఇంటికి వెళ్లి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా ఆ వీడియోను చై తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూట్యూబర్ తో కలిసి చేశాడు చైతన్య. నవంబర్ 23న చైతన్య బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలని సదరు యూట్యూబర్ చై ఫ్యాన్స్ ను అడుగుతాడు. అభిమానులు ఆయనను విష్ చేస్తున్న సమయంలోనే చై అక్కడికి వెళ్లి వారిని సర్ ప్రైజ్ చేస్తారు. వారితో కలిసి సరదాగా కాసేపు కబుర్లు చెప్తూ గడుపుతాడు. అభిమాన నటుడిని చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు.






ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ‘NC23‘


ఇక నాగచైతన్య చివరిసారిగా ‘కస్టడీ‘ సినిమాలో కనిపించారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు.  కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  NC23 వర్కింగ్ టైటిల్‏తో ఈ సినిమా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి కనిపించబోతోంది. మత్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలో సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది.


Read Also: ఓటీటీలోకి ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?