గతేడాది కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా నెలల పాటు థియేటర్లు మూతపడే ఉన్నాయి. అన్ లాక్ లో భాగంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చినా.. థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. ఆ తరువాత మెల్లగా క్రిస్మస్ నాటికి థియేటర్లను ఓపెన్ చేశారు. ఆ తరువాత జనవరిలో థియేటర్ల వద్ద సంక్రాంతి హంగామా కనిపించింది. 'క్రాక్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వంద సత్తా ఆక్యుపెన్సీతో ఇక థియేటర్లకు తిరుగు ఉండదని అందరూ భావించారు. 

 

కానీ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఏప్రిల్ నెలాఖరు నుండి మళ్లీ థియేటర్లకు మూతపడ్డాయి. రీసెంట్ గా థియేటర్ల పునః ప్రారంభానికి అనుమతులు లభించాయి. కానీ వేరే సమస్యలు ఉండడంతో వెంటనే థియేటర్లను తెరవడానికి ఎగ్జిబిటర్లు తటపటాయించారు. ఫైనల్ గా ఈ నెలాఖరులో థియేటర్లను పునః ప్రారంభిస్తున్నారు. ఈ వారంలో కొత్త సినిమాల హంగామా కనిపించబోతుంది. రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 'తిమ్మరుసు', 'ఇష్క్' లాంటి కాస్త పేరున్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

 

ఈ రెండూ కూడా చిన్న సినిమాలే. కాకపోతే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న కథలు కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. రెండు సినిమాల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. 'తిమ్మరుసు' ట్రైలర్ ను ఎన్టీఆర్ తో రిలీజ్ చేయిస్తే.. ప్రీరిలీజ్ ఈవెంట్ కి హీరో నాని గెస్ట్ గా వచ్చారు. 'ఇష్క్' సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారా..? లేదా..? థియేటర్ వద్ద ఎలాంటి వాతావరణం కనిపించబోతుంది అనేది తెలుసుకోవడానికి ఈ రెండు సినిమాలు పైలెట్ ప్రాజెక్ట్ లుగా ఉపయోగపడబోతున్నాయి. 

 

ఈ రెండు సినిమాల రిజల్ట్ ను బట్టి.. ఆగస్టులో సినిమాలను విడుదల చేయాలా..? ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలా..? అనే విషయంపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వస్తారు. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఉంది. దాంతో పాటు పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునే అవకాశాన్ని థియేటర్లకు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. 

 

అక్కడ యాభై శాతం ఆక్యుపెన్సీకే అవకాశం. దాంతో పాటు నైట్ షోలు లేవు. టికెట్ రేట్లపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేవలం మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే సినిమా విడుదల కానుంది. విశాఖ‌, విజ‌య‌వాడ‌, కాకినాడ లాంటి సిటీల్లోనే థియేట‌ర్లు తెర‌చుకోబోతున్నాయి. బీ, సీ సెంటర్లు తెరుచుకుంటాయో లేదో డౌటే. ఈ లెక్కన చూసుకుంటే ఏపీలో 25 శాతం థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తోన్న నిర్మాతలు టెన్షన్ లో పడ్డారు. కానీ ఎక్కువ రోజులు సినిమాలను ల్యాబ్ లో ఉంచలేక ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు.