టాలీవుడ్ లో ఈ మధ్య  కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు చాలానే వస్తున్నాయి. అయితే వాటిల్లో ఒకటో రెండో సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అలాంటి జోనర్ లో రాబోతున్న సినిమా ‘ముఖ చిత్రం’. ఈ సినిమాలో వికాస్ వశిష్ట హీరోగా కనిపించనున్నారు. ఆయన సరసన ప్రియ వడ్లమాని హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ హీరో విశ్శక్ సేన్ కీ రోల్ లో నటిస్తోన్న సినిమాకు గంగాధర్ దర్శకత్వం వహించగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ చూస్తే ఇంట్రస్టింగ్ గానే ఉందని చెప్పొచ్చు.


ట్రైలర్ ప్రారంభంలో ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని మొదలుపెట్టినా అది తర్వాత ఎన్నో ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఇందులో హీరో ఒక ప్లాస్టిక్ సర్జన్. ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు హీరో. కానీ ఆ హీరోయిన్స్ ఇద్దరికీ ఒకేసారి యాక్సిడెంట్ అవుతుంది. ఒకరు చనిపోగా ఇంకో హీరోయిన్ చావుబతుకుల మధ్య ఉంటుంది. ఆమెను హీరో ప్లాస్టిక్ సర్జరీ చేసి కాపాడతాడు. సర్జరీ తర్వాత ఆమె నుంచి హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు. ఎలాంటి కష్టాలు మొదలైయ్యాయి. అసలు కోర్ట్ వరకూ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్ట్ లో ఏం జరిగింది వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. మొత్తం మీద ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. 



ప్రస్తుతం యువ నటుడు విశ్వక్ సేన్ విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కథ డిమాండ్ ను బట్టి ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో లాయర్ పాత్ర లో కనిపించన్నారు విశ్వక్. అలాగే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ రవి శంకర్ కూడా మరో లాయర్ గా అలరించనున్నారు. విశ్వక్, రవిశంకర్ మధ్య వచ్చే కోర్ట్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలిచే అవకాశం  కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు సందీప్ రాజ్ మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ మూవీకు కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే సందీప్ రాజ్ అందిస్తున్నారు.  ఆయన గతంలో ‘కలర్ ఫోటో’ సినిమాను తెరకెక్కించారు. కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా భారీ వజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ అందించడంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ఎస్కేఎన్ సమర్పణలో ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా సినిమాను నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డిసెంబర్ 9 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా