Kalki 2898 AD Review: కల్కి 2898 AD మూవీలో క్యామియో రోల్‌ చేసిన మృణాల్ ఠాకూర్..రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సినిమా అద్భుతం అంటూ మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌నీ ప్రశంసించింది. ప్రభాస్‌, దీపికా పదుకొణె, అమితాబ్ నటననీ మెచ్చుకుంటూ ఓ నోట్‌ రాసింది. "వాట్ ఏ ఫిల్మ్. ఆ విజువల్స్ చూస్తుంటే కళ్లు చెదిరిపోయాయి. టీమ్‌ అంతా అద్భుతంగా పని చేసింది. సెట్స్ డిజైన్ నుంచి మిగతా అన్ని క్రాఫ్ట్‌లూ చాలా గొప్పగా ఉన్నాయని" తెగ పొగిడింది. నాగ్ అశ్విన్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పింది. అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్‌ని అయితే ఆకాశానికెత్తేసింది. ప్రతి సీన్‌లోనూ డామినేట్ చేశారని, సుమతిగా దీపికా పదుకొణె తెరపైన కనిపించిన ప్రతిసారీ హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పిందీ మృణాల్ ఠాకూర్.





ప్రభాస్‌నీ ఇదే రేంజ్‌లో పొగిడింది. బుజ్జితో ఉన్న సీన్స్ అన్నీ అదుర్స్ అని కితాబిచ్చింది. కమల్‌ హాసన్ నటనపైనా ప్రశంసలు కురిపించిన మృణాల్ పార్ట్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తుండడం చాలా గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌లో డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌తో పాటు ప్రియాంక దత్, స్వప్నా దత్‌నీ ట్యాగ్ చేసింది. ఇంత గొప్ప సినిమాలో తానూ ఓ చిన్న పాత్రలో కనిపించడం సంతోషంగా ఉందని నోట్‌ని ముగించింది సీతారామం బ్యూటీ. 


సినిమా మొదట్లోనే ఓ చిన్న క్యారెక్టర్‌లో కనిపించింది మృణాల్ ఠాకూర్. ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ చేసింది. మృణాల్‌తో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో క్యామియో రోల్స్ చేశారు. విజయ్ దేవర కొండ అర్జునుడి పాత్రలో కనిపించాడు. వీళ్లతో పాటు రాజమౌళి, శ్రీనివాస్ అవసరాల, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్‌ కూడా అతిథి పాత్రల్లో మెరిశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో జూన్ 27న విడుదలైన కల్కి 2898 AD సినిమా కలెక్షన్స్‌లో ఎక్కడా జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.800 కోట్లు కొల్లగొట్టింది. త్వరలోనే రూ.1000 కోట్లు రాబట్టనుంది. సినిమా కథపై భిన్నాభిప్రాయాలు, వాదనాలు ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్‌ టేకింగ్‌కి మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. చివరి 40 నిముషాలు మొత్తం సినిమాకే హైలైట్. హాలీవుడ్ రేంజ్‌ విజువల్ గ్రాఫిక్స్‌తో కట్టిపడేశారు. కర్ణుడి పాత్రలో కనిపించిన ప్రభాస్ అదరగొట్టాడంటూ ఇప్పటికే ఫ్యాన్స్‌ ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సీక్వెల్‌ కూడా ఇదే రేంజ్‌లో ఉండాలని నాగ్ అశ్విన్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే..సీక్వెల్‌లో ప్రభాస్‌ స్క్రీన్‌ టైమ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు నాగ్ అశ్విన్. 


Also Read: Kalki 2898 AD: ప్రభాస్ క్యారెక్టర్ చనిపోతుంది, కల్కి 2898 AD సీక్వెల్‌పై మహాభారత్ సీరియల్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్