ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదాన్ని ముగించేందుకు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితర దర్శకులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబు హాజరు కాకపోవడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ప్రభుత్వం నుంచి మోహన్ బాబుకు ఆహ్వానం అందలేదని, అందుకే ఆయన వెళ్లలేదనే ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి మంచు విష్ణు.. మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబుకు ఆహ్వానం అందినా కొందరు ఆయనకు ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మోహన్ బాబు కూడా స్పందించారు. 


ఇండస్ట్రీలో ఇగోలు: ఏపీలోని టికెట్ ధరల ప్రభావం ‘సన్ ఆఫ్ ఇండియా’ ఉంటుందా అనే ప్రశ్నకు మోహన్ బాబు స్పందిస్తూ.. ‘‘నలుగురితో నారాయణ. అందరికీ ఏ న్యాయం జరుగుతుందో నాకు అదే జరుగుతుంది. ఈ సమస్యకు నా వద్ద అద్భుతమైన ఐడియా ఉంది. కొద్ది రోజుల కిందట నేను ఒక ఉత్తరం రాశా. అది చూసి జ్ఞానోదయం రావాలి. కానీ, అంతా షూటింగ్‌లో బిజీగా ఉన్నామని, ఎల్లుండి కలిస్తే ఓకే అన్నారు. అంటే, నేను మాత్రమే ఖాళీగా ఉన్నానా? ఏపీలో టాలీవుడ్ ఎందుర్కొంటున్న సమస్యపై మాట్లాడేందుకు ఒక టైమ్ పెట్టండి. ఇతర దేశాల్లో ఉన్నవారు తప్పా.. మిగతావాళ్లను పిలిపించండి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎన్నార్ నుంచి శివాజీ రాజా వరకు.. సినీ ఇండస్ట్రీకి ఏ కష్టమోచ్చినా ఒక చోట కూర్చొని చర్చించుకొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో యునిటీ ఉండేది. ఇప్పుడు ఇగోలు పెరిగిపోయాయి. అందుకే వాళ్లు కలవడం లేదు’’ అని అన్నారు. 


పిలిచినా పిలవకపోయినా నాకంటూ చరిత్ర ఉంది: ‘‘వాళ్లు నన్ను పిలవమన్నారు. కానీ, నాకు కబురు చేయలేదు. ఒకరు పిలిచినా పిలవకపోయినా నా కంటూ చరిత్ర ఉంది. నాకు క్రెడిబిలిటీ వాల్యూ ఉంది. క్రమశిక్షణ ఉంది. నా పని నేను చేసుకుంటూ పోతా. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే నాకు ఇష్టం. ఆయన నాకో విషయం చెప్పారు. మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారంటే అది వారి ఖర్మ అన్నారు. నీ కంటే నేను గొప్పవాడిని కాదు. నాకు నేను గొప్పా అనుకోవాలి. మన అందరి కంటే గొప్పవాడు దేవుడు. ఏదీ శాస్వతం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా.. చివరికి పడేది చెత్తబుట్టలోనే. ఆ గాలి పటం ఎవరైనా కావచ్చు’’ అని అన్నారు. ఇతర ఆర్టిస్టులు, వాళ్లు తీసుకుంటున్న పారితోషికాలపై కామెంట్స్ చేయనని, తన గురించి మాత్రమే మాట్లాడతానని తెలిపారు. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని అన్నారు. బయట రాజకీయల తరహాలోనే ఇండస్ట్రీలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారని, తన దృష్టిలో ఎవరూ గొప్ప కాదని, మనం చేసే పనులన్నీ పైన భగవంతుడు చూస్తున్నాడని మోహన్ బాబు తెలిపారు. 


Also Read: ‘డైరెక్టర్ ముద్దులు పెట్టించాడు, నాకు ఇష్టమే, విష్ణుకు ఇష్టంలేదు’ - మోహన్ బాబు


విష్ణు, జగన్‌ను కలిస్తే వివాదం ఎందుకు?: ‘‘ఏపీ సీఎం జగన్ ఇంటికి విష్ణు వెళ్తాడు. ఎందుకంటే జగన్‌కు విష్ణు బావమరిది. జగన్ భోజనానికి పిలిచి ఉండవచ్చు కదా. విష్ణును జగన్ ఎంతో అప్యాయంగా చూస్తాడు. విష్ణు కూడా ఆయనపట్ల ఎంతో సిన్సియర్‌గా ఉంటాడు. వాళ్లు పిలిచి ప్రేమగా భోజనం పెట్టారు. యూనివర్శిటీ ఇచ్చినందుకు విష్ణు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లి ఉండవచ్చు. ఒక బంధువుగా ఎందుకు విష్ణు ఎందుకు వెళ్లి ఉండకూడదు. భోజనం చేస్తున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చర్చ జరిగి ఉంటుంది కదా. దాదాపు మూడేళ్లు అవుతుంది సీఎం నుంచి ఏం తీసుకున్నాం చెప్పండి. వారికి ప్రచారం కూడా చేశాం. జగన్‌ను విష్ణు కలిస్తే ఎందుకు వివాదం చేస్తున్నారు??’’ అని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read:  'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!