బుల్లితెరపై యాంకర్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. ఆ తరువాత నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన సినిమాలు భారీ విజయాలు అందుకోవడంతో.. మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 'రంగస్థలం' సినిమా అనసూయ కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. రీసెంట్ గా విడుదలైన 'పుష్ప' సినిమాలో దాక్షాయణి అనే క్యారెక్టర్ లో కనిపించింది అనసూయ. ఇప్పుడు 'పుష్ప' పార్ట్ 2లో నటిస్తుంది ఈ బ్యూటీ. 


ఇదిలా ఉండగా.. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలానే ట్రోలింగ్ పై ఘాటుగా స్పందిస్తుంటుంది. ఎవరైనా తనను ట్రోల్ చేస్తే.. అంతే ధీటుగా సమాధానాలు చెబుతుంటుంది. బహుశా.. సోషల్ మీడియాలో అనసూయను ట్రోల్ చేసే రేంజ్ లో మరెవరినీ చేయరేమో..!


తరచూ ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా అనసూయ అందాలను పొగుడుతూ ఓ మీడియా పోర్టల్ లో కథనాన్ని ప్రచురించారు. అందులో అనసూయను పొగుడుతూనే.. నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. అలానే అనసూయ వయసు నలభైకి పైగా అని రాశారు. ఈ కథనం అనసూయ కంటపడడంతో వెంటనే రెస్పాండ్ అయింది ఈ బ్యూటీ. 


సదరు జర్నలిస్ట్ పేరుని తన ట్వీట్ లో ప్రస్తావిస్తూ.. తన వయసు 40 కాదని.. 36 అని చెప్పింది అనసూయ. అయినా.. వయసు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని.. ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్పింది అనసూయ (వయసు పెరిగినా అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తా). మీలాంటి జర్నలిస్ట్ లు మీ బాధ్యతను నిజాయితీతో, నైతికతో నిర్వర్తిస్తే  బాగుంటుందని సూచించింది అనసూయ.