ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 

 

''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రోజుల క్రితం హాస్పిటల్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. తన ఆరోగ్యం బాగుండలేదని తెలిసి.. మద్రాసులో ఒక మంచి హాస్పిటల్ ఉందని, ఇద్దరం వెళదాం అక్కడ జాయిన్ అవుదురు గాని అని అన్నాను. ఆయన మిత్రమా ఈరోజు ఇక్కడ జాయిన్ అవుతాను.. నెలాఖరులోపు వచ్చేస్తాను. నువ్వు అన్నట్లుగానే అప్పటికి ఉపశమనం రాకపోతే, ఖచ్చితంగా మనిద్దరం కలిసి అక్కడకి వెళ్దాం అన్నారు. 

 

అలా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారు అనేది ఊహించలేకపోయాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయనకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందివ్వాలని ఉద్దేశంతో ఆరోజు ఆయనకు ఫోన్ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారు. అంత ఉత్సాహంగా దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడితే కచ్చితంగా ఏమీ జరగదు అని నేను అనుకున్నాను. ఆ సమయంలో వారి కుమార్తెతో కూడా మాట్లాడాను. మీతో మాట్లాడాక నాన్నగారు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. నన్ను సీతారామశాస్త్రి గారి కుటుంబంలో వాళ్లు ఎంతగా అభిమానిస్తారో అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఇద్దరూ ఒకటే వయసు వాళ్లం కావడంతో ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు, ఎప్పుడు కలిసినా.. చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరిస్తూ మాట్లాడతారు. 

 

తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరిగారి తరువాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్ధం చేసుకోవడానికి కూడా మనకున్న పరిజ్ఞానం సరిపోదు అంతటి మేధావి ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు తన కెరీర్లో అందుకున్న ఆయనకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందివ్వగా ఆ రోజున నేను వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో చాలా సేపు గడిపాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువుని కోల్పోయినట్లుగా చాలా దగ్గరి ఆత్మీయుడుని కోల్పోయినట్టే అనిపిస్తుంది. గుండె తరుక్కుపోతోంది, గుండెంతా బరువెక్కి పోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేదు. ఎంతోమందిని శోక సముద్రంలో ముంచి దూరమైనా ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకమంతటికి అన్యాయం చేశారు. ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వెళ్లిపోయారు. 

 

ముఖ్యంగా నాకు అత్యంత ఇష్టమైన రుద్రవీణ సినిమాలోని తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అనే పాటలోలాగా ఆయనే మన అందరినీ వదిలి తరలి వెళ్లిపోయారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కానీ ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్రపరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. భౌతికంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు కానీ తన పాటలతో ఇంకా ఆయన బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా బతికే ఉంటారు'' అంటూ రాసుకొచ్చారు.