తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటల్లోని సాహిత్యం మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఆయన మూడు వేలకు పైగా పాటలు రాసినప్పటికీ.. సీతారామశాస్త్రి అనగానే వెంటనే గుర్తొచ్చే పాట. 

 

'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని 

మారదు లోకం.. మారదు కాలం.. 

దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోనీ 

మారదు లోకం.. మారదు కాలం..'

 

ఈ అక్షరాలన్నీ సత్యాలే.. 1993లో విడుదలైన 'గాయం' సినిమాలోని ఈ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో ప్రతీ పదం తూటాల పేలుతుంటుంది. 

 

కొన్ని పాటలు మాత్రం మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. దానికి ఉదాహరణగా 'కొత్తబంగారు లోకం' సినిమాలో ఓ పాట గురించి చెప్పుకోవచ్చు. 

 

'నీ ప్రశ్నను నీవే ఎవ్వరూ బదులివ్వరుగా 

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా 

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా 

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా 

పదినెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా.. 

అపుడో ఇపుడో కననే కనను అంటుందా' 

 

ఈ పాట వింటే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. తప్పకుండా ముందుకు సాగగలమనిపిస్తుంది. ఆ పద సంపదకు ఉన్న గొప్పతనం అలాంటిది. 

 

నారా రోహిత్ నటించిన 'రౌడీ ఫెలో' సినిమా కోసం ఓ పాట రాశారు సిరివెన్నెల. 

 

'పేరుకు ఇందరు జనం

పేరుకుపోయిన ఒంటరితనం 

నరనరమున పిరికితనం 

ప్రశ్నిస్తే జవాబు మనం' 

 

ఈ నాలుగు లైన్లు.. తన మనసుకి దగ్గరగా ఉంటాయని చెబుతుంటారు నారా రోహిత్. 

 

మారుతున్న కాలంతో తన కలం నుంచి వచ్చే పదాల్ని కూడా అప్డేట్ చేసుకుంటూ.. సరికొత్త సాహిత్యంతో అలరించారు సీతారామశాస్త్రి. ఆ సాహిత్యం ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిసి అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి