Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, ఇప్పుడు తనను ఎలా ఫీల్ అవుతున్నారని చాలా మంది అడుగుతున్నారని, కానీ ప్రస్తుతం తన మైండ్ బ్లాంక్‌గా ఉందని రామ్ చరణ్ అన్నారు. కర్ణాటకలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. అభిమానులు ఈ సినిమా చూడాలని తాను కూడా ఎదురు చూస్తున్నానన్నారు. ఈ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారంటే...


‘అందరికీ నమస్కారం. పునీత్ రాజ్‌కుమార్ మా కుటుంబ సభ్యుడి లాంటి వారు. ఆయన ఇక్కడ లేరని నేను నమ్మడం లేదు కూడా. ఎన్టీఆర్ చెప్పినట్లు ఆయన ఇక్కడే ఎక్కడో ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆయన లేని లోటు శివన్న (శివరాజ్ కుమార్)తో తీర్చుకుంటాం. మేం చనిపోయే వరకు పునీత్ మా గుండెల్లో ఉంటారు.’


‘ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, నా మిత్రుడు ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌కు ధన్యవాదాలు. ఇక్కడ ఎంతో సేపటి నుంచి ఉండి ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసినందుకు నా అభిమానులకు, తారక్ అభిమానులకు ధన్యవాదాలు.’


‘నాకు, తారక్‌కు నీడలాగా ఉండి అభిమానులు నడిపిస్తున్నారు. నన్ను ఎవరో అడిగారు. సినిమా విడుదల అవుతుంది కదా... నీ ఫీలింగ్స్ ఏంటి అని. ప్రస్తుతం నా మైండ్ బ్లాంక్‌గా ఉంది. ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఆ సినిమా చూడాలని నేను ఎదురుచూస్తున్నాను.’


‘కర్ణాటక మాకు చాలా పెద్ద మార్కెట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఎంత పెద్ద మార్కెట్లో తెలంగాణ కూడా అంతే పెద్దది. ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న కేవీఎన్ సినిమాస్ వెంకట్‌కు ధన్యవాదాలు. మోస్ట్ డైనమిక్ ప్రొడ్యూసర్ దానయ్యకు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ధన్యవాదాలు. కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి టీమ్‌కు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.’ అన్నారు.


అందరూ సినిమాను థియేటర్లకు వెళ్లే చూస్తారా? అని అభిమానులను ఫన్నీగా ప్రశ్నించారు. ఆ తర్వాత రాజమౌళి వైపు తిరిగి ‘సార్... అంతేగా... ఇంకెవరూ లేరుగా.’ అని కామెడీగా అడగటంతో స్టేజ్‌పై ఉన్న వారందరూ నవ్వారు. ఆ తర్వాత మైక్‌ను తారక్‌కు అందించారు.