కోలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ లలో ఒకరు మంజిమా మోహన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంజిమా తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఆమె వివాహం జరిగింది. తన ప్రియుడు, నటుడు గౌతమ్ కార్తీక్‌ ను చెన్నైలోని ఓ హోటల్ లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె వివాహ వేడుకలో ఆశ్చర్యకరంగా పెళ్లికి వచ్చిన అతిథులు ఆమె శరీర ఆకృతి గురించి వ్యంగ్యంగా కామెంట్లు చేశారని చెప్పింది మంజిమా.


ఓ ఇంటర్వూలో మాట్లాడిన మంజిమా పెళ్లిలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంది. తనపై ఎప్పటి నుంచో ట్రోల్స్ వస్తున్నాయని చెప్పింది. అయితే అవేమీ తన వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపవని చెప్పింది. బాడీ షేమింగ్ ట్రోల్స్ తనకు కొత్తేమీ కాదని, బయటే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ తనపై ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటాయని పేర్కొంది. తన పెళ్లి వేడుకలోనూ కొంతమంది తాను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేశారని చెప్పింది.


ప్రస్తుతం తన శరీరంతో తాను సంతృప్తిగా ఉన్నానని, తాను కావాలి అనుకుంటే బరువు తగ్గుతానని తెలిపింది. వృత్తి పరంగా బరువు తగ్గాల్సిన సమయంలో తగ్గడం తనకి అంత కష్టమేమీ కాదని చెప్పింది. తాను లావుగా  ఉంటే దాని వలన ఇతరులకు వచ్చే సమస్య ఏంటో అర్థం కావడంలేదని పేర్కొంది. పెళ్లిలో కూడా బాడీ షేమింగ్ వేదింపులు బాధపెట్టాయని పేర్కొంది.


ఇప్పుడు సినిమాలు చేయడానికి కూడా తాను సిద్దంగా ఉన్నానని, మంచి కథ దొరికితే నటిస్తానని మంజిమా తెలిపింది. పెళ్లి కూడా అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. తాను కార్తీక్ తో మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నానని, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా అని దాని గురించి ఆలోచించలేదని, ఇంట్లో వాళ్లు చెప్పడంతో జీవితంలో సెటిల్ అయ్యేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లు తెలిపింది. గతంలో దర్శకుడు గౌతమ్ మీనన్ బర్త్‌ డే వేడుక కోసం ఈ గ్రీన్ మెడోస్ హోటల్ ను సందర్శిచానని, ఆ ప్లేస్ నచ్చడంతో అక్కడే తమ పెళ్లి సింపుల్ గా ప్లాన్ చేశామని చెప్పింది. 


మంజిమా మోహన్ చైల్ట్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో అడుగు పెట్టింది. తర్వాత 2015 లో వచ్చిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. మలయాళం తో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేసింది మంజిమా. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,  ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి సినిమాల్లో నటించి తెలుగులోనూ అభిమానులను సంపాదించుకుంది.  గౌతమ్, మంజిమ  కలిసి నటించిన ‘దేవరాట్టం’ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అయితే ఏడాది తర్వాత తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైయ్యింది ఈ జంట. ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్ లో సర్కులేట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.