సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది కానీ సామాన్య ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోతుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేదని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి కథను మహేష్ తన భుజాలపై నడిపించారని అంటున్నారు. 

 

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మహా రాసిన ఈ ర్యాప్ ను శ్రవణ భార్గవి, శ్రీ సౌమ్య వారణాసి, మనీష్, శృతి రంజని ప్రత్యూష పల్లపోతు, హారికా నారాయణ్ కలిసి పాడారు. తమన్ సంగీతం అందించారు. సినిమాలో ఈ ర్యాప్ లేదు కానీ ఫ్యాన్స్ కోసం ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. 

 

ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది. రిలీజ్ చేసిన కాసేపటికే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ.75 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ వదిలారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.