గాయకుడు సిద్ శ్రీరామ్ పాటంటే.. చెవులు కోసుకోనేవారు చాలామందే ఉన్నారు. వినులవిందుగా సాగే అతడి గాత్రానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా  సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సిద్ పాటకు ఫిదా అయ్యారు. సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమాలోని ఓ పాటను మహేష్ బాబు ఆదివారం విడుదల చేశారు. ‘‘అలోన్ అలోన్.. పాటను నా ప్లేలిస్టులో చేర్చుతున్నా. మెలోడీ బాగుంది. సుమంత్, అనుప్ రూబెన్స్, సిద్ శ్రీరామ్‌కు గుడ్‌లక్’’ అంటూ మహేష్ ఈ పాటను ట్విట్టర్‌ ద్వారా రిలీజ్ చేశారు. 


అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఎంతో చక్కగా ఆలపించాడు. ‘‘కనులకు తెలియని ఓ కలలా.. వెళిపోయావే నువ్వు ఎలా.. మిగిలా నేనే ఓ శిలలా.. అలోన్..’’ అంటూ సాగే ఈ పాట మనల్ని కాసేపు వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ పాట కట్టిపడేస్తుంది. కృష్ణ చైతన్య రాసిన ఈ సాంగ్ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.


Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?


ఈ చిత్రంలో సుమంత్ సరసన నయనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. రెడ్ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత కె.రాజశేఖర్ రెడ్డి. అయితే, ఈ సినిమాకు సరికొత్తగా పబ్లిసిటీ చేశారు. సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఓ శుభలేఖను సోషల్ మీడియాలోకి వదిలారు. అది వైరల్ కావడంతో.. సుమంత్ స్పందించక తప్పలేదు. అది తన ‘మళ్లీ మొదలైంది’ సినిమా ప్రమోషన్‌లో భాగమని చెప్పాడు. దీంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ద్వారా విడాకులు, మళ్లీ పెళ్లి అంశంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ఇటీవల హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ‘‘ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం’’ అంటూ సాగే పాట కూడా ప్రేక్షకులకు నచ్చేసింది. ఈ చిత్రంలో పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఇదివరకు సుమంత్ నటించిన ‘మళ్లీ రావా’ సినిమా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మళ్లీ మొదలైంది’ సినిమాతో సుమంత్ మరోసారి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. 


మహేష్ బాబు విడుదల చేసిన సాంగ్ (ట్వీట్):