ఏపీ పరిషత్ ఎన్నికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. 'ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్  ఎన్నికలను బహిష్కరించింది. అధికారులు, పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం అని వైసీపీభావిస్తే...ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే అసలు విషయం తెలుస్తోంది. ఆ దమ్ము వైసీపీకి ఉందా ? వైసీపీ నాయకులు ఏకగ్రీవాల మాటున సాగించిన అరాచకం వర్ణించలేనిది. వాటిని ఎన్నికలు అనరు. అది సెలక్షన్ తప్ప ఎలక్షన్ కాదు' అని అచ్చెన్నాయుడు విమర్శించారు.  


సీఎం జగన్ హెచ్చరికలు


వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసిందన్నారు. అడ్డదారుల్లో, అక్రమాల ద్వారా ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే కబళించే స్థాయిలో వైసీపీ నేతలు వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రులు నేరుగా రాజ్ భవన్ కి వెళ్లాల్సిందేనని రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని సీఎం జగన్  హెచ్చరించడంతో మంత్రులు, శాసనసభ్యులు గ్రామాల మీద పడి దండయాత్ర చేశారని ఆరోపించారు. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమకేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారన్నారు.  


Also Read: AP ZPTC MPTC Results: కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్... బ్యాలెట్ పేపర్లకు చెదలు, బాక్సుల్లో నీరు...


వైసీపీ నేతల బెదిరింపులు


ప్రజల్ని ఏం ఉద్దరించారని మీకు ఏకగ్రీవంగా పట్టం కడతారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72  శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందన్నారు.  అరాచకం, దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు చేసింది ఏమిటో చెప్పుకొని ఓట్లు అడుగుతారు కానీ వైసీపీ నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలతో  ఓటు వెయ్యకపోతే ఊళ్ళో ఉండరని, సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, ఇళ్లు కూల్చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య విలువలకు సిలువ వేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 


Also Read: ZPTC MPTC Results Live Updates: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు