Love U Ram Trailer: యూత్ ను ఎక్కువగా ఆకట్టుకునే సినిమాల్లో లవ్ స్టోరీ  కేటగిరీ కూడా ఒకటి. కంటెంట్ ఉండాలే గానీ సినిమాను హిట్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఈ మధ్య కాలంలో లవ్ ట్రాక్ లో వచ్చిన చాలా చిన్న సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి కూడా. అదే నమ్మకంతో టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దర్శకుడు డి వై చౌదరి. ఆయన  దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ యూ రామ్’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది మూవీ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్.


మోసం, నమ్మకం చుట్టూ తిరిగే ప్రేమకథ..


‘లవ్ యూ రామ్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్న అమ్మాయి పెద్దయిన తర్వాత తాను ప్రేమించిన వాడు ఒక మోసగాడు అని తెలిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా మెయిన్ ప్లాట్. ట్రైలర్ లో కూడా ఆ విషయాన్నే చెప్పారు మేకర్స్. హీరో విదేశాల్లో ఉంటాడు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తుంటాడు.  ఈ క్రమంలోనే హీరోయిన్ ను కలుస్తాడు. అయితే తాను చిన్నప్పటి నుంచి ప్రేమించిన అబ్బాయి మోసగాడు అని తెలిసిన తర్వాత హీరోయిన్ రియాక్షన్ ఏంటి? భిన్నమైన మనస్తత్వం ఉన్న ఈ ఇద్దరి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుందో అనేది సినిమా. మూవీలో డైలాగ్స్, మ్యూజిక్ పర్వాలేదనిపించాయి. ఎమోషన్స్ సీన్స్ కూడా ఉన్నట్టే కనిపిస్తోంది. రోహిత్ బెహల్ ట్రెండీగా కనిపించారు. అపర్ణ జనార్దనన్ ను కథకు తగ్గట్టు చూపించారు. 


దశరథ్ కథే కీలకం..


టాలీవుడ్ లో మంచి రచయిత, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దశరథ్. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లకు దర్శకత్వం వహించిన దశరథ్ తర్వాత పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తర్వాత 2002 లో వచ్చిన ‘సంతోషం’ సినిమాకు దర్శకత్వం వహించి మంచి హిట్ ను అందుకున్నాడు. తర్వాత 2011 లో వచ్చిన ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో ‘ఫ్యామిలీ సర్కస్’, ‘నువ్వు నేను’ వంటి హిట్ సినిమాలకు రచయితగా కూడా పనిచేశాడు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు కథను అందించాడు. మరి దశరథ్ మార్క్ ఈ మూవీలో కనిపిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీను డి.వై చౌదరి, దశరథ్ కలసి నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ గా సాయి సంతోష్ , సంగీత దర్శకుడిగా కె వేద చేశారు. ఈ చిత్రానికి ఎస్‌ బి ఉద్ధవ్ ఎడిటర్, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. జూన్ 30 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.




Read Also : మంగళవారం రోజు పాప పుట్టడం సంతోషం - జాతకం కూడా చాలా బాగుందంటున్నారు: చిరంజీవి